హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఐఐటీలు, ఎన్ఐటీలో చేరేందుకు జేఈఈ మెయిన్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. షెడ్యూళ్ల రూపకల్పనలో అది రాష్ర్టాలతో సమన్వయం చేసుకోకపోవడంతో ఇటు విద్యా బోర్డులు, అటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఎన్టీఏ తీరుతో తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను రెండుసార్లు మార్చాల్సి వచ్చింది. ఎన్టీఏ కార్యాలయం ఢిల్లీలో ఉండటంతో విద్యార్థులు ట్విట్టర్ లేదా ఈ మెయిల్ ద్వారా తమ సమస్యలను విన్నవించుకోవాల్సి వస్తున్నది.
సాంకేతికత అలవాటులేని గ్రామీణ విద్యార్థులు చాలా మంది ఏకంగా అవకాశాలను చేజార్చుకుంటున్నారు. రాష్ర్టాల్లో ఎన్టీఏ కార్యాలయాలు లేకపోవడం కనీసం నోడల్ అధికారులను నియమించకపోవడంతో ప్రతి దానికీ ఢిల్లీకి చెప్పుకోవాల్సి వస్తున్నది. రాష్ర్టాల్లో సమాచారమిచ్చేందుకు స్థానిక భాషల్లో హెల్ప్డెస్క్లు, సేవలందించేందుకు నోడల్ అధికారులను నియమించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. తాజాగా సోమవారం జేఈఈ మెయి న్ షెడ్యూల్ విడుదలైనట్టు సోషల్మీడియాలో ఓ పోస్టు చక్కర్లు కొట్టింది. ఈ నోటిఫికేషన్ అసలుదా.. నకిలీదా అన్న సందేహాలు తీర్చుకునే అవకాశం లేకపోయింది. వెబ్సైట్ను చూస్తేగాని అది ఫేక్ అని నిర్ధారణ కాలేదు.