జైపూర్, డిసెంబర్ 25: రాజస్థాన్లో కోట పేరు చెప్పగానే మనకు నీట్, జేఈఈకి బెస్ట్ కోచింగ్ సెంటర్ల పేర్లు గుర్తుకొస్తాయి. అయితే, ఇక్కడ ఆ విద్యార్థుల కోరికలు తీర్చే ఓ దేవుడు కూడా ఉన్నాడు. తల్వండి ఏరియాలో ఉన్న రాధాకృష్ణ ఆలయానికి నీట్, జేఈఈ అభ్యర్థులు క్యూ కడుతారు. తమను ఎలాగైనా నీట్, జేఈఈనుంచి గట్టెక్కించాలని ఆలయంలోని ‘విశ్వాసాల గోడ’పై రాస్తారు. ఎయిమ్స్ ఢిల్లీలో సీటు రావాలని కొందరు కోరుకుంటే, ఐఐటీ ఢిల్లీలో ప్రవేశం లభించాలని మరికొందరు వేడుకుంటారు. ఇక్కడ మొక్కితే కోర్కెలు నెరవేరుతాయని విద్యార్థులు విశ్వసిస్తున్నారు. ప్రతిరోజూ 300 మంది విద్యార్థులు ఈ గుడికి వస్తూ ఉంటారని, ప్రతి రెండు నెలలకోసారి గోడకు పెయింట్ వేయిస్తున్నామని పూజారి తెలిపారు.