హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు, ఇంధన పొదుపు అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉన్నదని, విద్యార్థి దశలో అవగాహన కల్పించడం ద్వారానే వాటిని ఆదా చేయగలమని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరుతూ విద్యాశాఖకు లేఖ రాయాలని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవుపల్లి ప్రభాకర్రావుకు సూచించారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్యభవన్లో ఇంధన పరిరక్షణ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. విద్యుత్తును ఆదా చేయడంతోపాటు సోలార్ విద్యుత్తు ఉత్పత్తిలో పురోగతి సాధించిన పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు మంత్రి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక యూనిట్ విద్యుత్తును ఆదా చేస్తే రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్టేనని, ప్రతి ఒక్కరూ విద్యుత్తు వృథాను అరికట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఒక కేస్ స్టడీ: ప్రభాకర్రావు
విద్యుత్తు రంగంలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని, రాష్ట్రం సాధించిన విజయాలు యావత్తు దేశానికి కేస్ స్టడీలాంటివని టీఎస్ట్రాన్స్కో, జెడ్కో సీఎండీ దేవుపల్లి ప్రభాకర్రావు అన్నారు. ‘రేపటి వెలుగుల కోసం’ అన్న నినాదంతో విద్యుత్తు సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. విద్యుత్తు నష్టాలను తగ్గించడం ద్వారా టారిఫ్ను తగ్గించడంపై దృష్టిసారించామని తెలిపారు. స్వరాష్ట్రంలో రూ.85 వేల కోట్లు వెచ్చించి విద్యుత్తు సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేశామని, మరో రూ.8 వేల కోట్లతో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయని వివరించారు. బొగ్గు సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గినా తెలంగాణలో మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్పత్తి చేశామని గుర్తుచేశారు.. 2023 నాటికి సోలార్ విద్యుత్తు ఉత్పత్తి 7,000 మెగావాట్లకు చేరుకునే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, ఈవీ చార్జింగ్ స్టేషన్లకు బల్క్గా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని తెలిపారు.
ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అమలు: సతీశ్రెడ్డి
రాష్ట్రంలోని కమర్షియల్ భవనాల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ను అమలుచేస్తున్నామని, తక్కువ విద్యుత్తు వినియోగం అయ్యే విధంగా భవనాల నిర్మాణాల్లో ఆధునిక పద్ధతులు పాటించేలా ప్రోత్సహిస్తున్నామని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి తెలిపారు. దీనిని మున్సిపల్ చట్టంలో చేర్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇప్పటివరకు 603 భవనాలు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మితమయ్యాయని వివరించారు. తద్వారా 370.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయ్యిందని తెలిపారు. తెలుపు రంగు రేషన్కార్డు ఉన్నవారికి 28 వాట్ల బీఎల్డీసీ ఫ్యాన్లు, ఎల్ఈడీ బల్బులను సబ్సిడీతో అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈఎంఐ విధానంలో ఎలక్ట్రిక్ బైక్లు కొనుగోలు చేసేందుకు మొబైల్ అప్లికేషన్ రూపొందించామని, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను విరివిగా నెలకొల్పుతున్నామని వివరించారు. కార్యక్రమంలో ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ సునీల్శర్మ, ఎమ్మెల్యే భాస్కర్రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్ రెడో వైస్ చైర్మన్, ఎండీ జానయ్య తదితరులు పాల్గొన్నారు.
అవార్డు గ్రహీతలు
విద్యుత్తు పొదుపు అవార్డులు అందుకొన్న సంస్థల్లో ఐటీసీ లిమిటెడ్ (పేపర్బోర్డ్స్), మైహోం ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ, విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్, విప్రో లిమిటెడ్, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, జనగామ, ఫలక్నుమా బస్డిపోలు, నల్లగొండ మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ, జీఎమ్మార్ ఎయిర్పోర్ట్, గ్రాన్యుయల్స్ ఇండియా, లేఖాభవన్, సంచాలన్భవన్ ఉన్నాయి.
విద్యుత్తు పొదుపు అవార్డు కేసీఆర్కే ఇవ్వాలి
విద్యుత్తును పొదుపు చేసేందుకు ఇస్తున్న అవార్డును తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్కే ఇవ్వాల్సి ఉంటుందని జగదీశ్రెడ్డి కొనియాడారు. తాను రూంలోకి వెళ్లేటప్పుడు, తిరిగి బయటికి వచ్చేటప్పుడు లైట్లు, ఫ్యాన్లను వేయడం, ఆర్పడం సీఎం కేసీఆర్ స్వతహాగా చేస్తుంటారని, విద్యుత్తు పొదుపు అంశంలో అత్యంత కఠినంగా ఉంటారని ఉదహరించారు. విద్యుత్తు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్నంత అవగాహన ఏ పాలకులకు లేదని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు.