గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
శిల్పాలు వెయ్యేండ్లనాటివని వెల్లడి
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కొండపోచమ్మ గ్రామ శివారులోని నాగపూరు ఏనెగుట్టపై వెయ్యేండ్ల్లనాటి జైన శిల్పాలు బయల్పడ్డాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు వీటిని గుర్తించి పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డికి సమాచారం అం దించగా ఆయన మంగళవారం వాటిని పరిశీలించారు. గుట్టపై బయల్పడిన రెండు విగ్రహాల్లో ఒకటి జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరునిదని, రెండోది జైన చాముఖ శిల్పమని శివనాగిరెడ్డి తెలిపారు. చాముఖ శిల్పంపై నలువైపులా ఆదినాథుడు, నేమినాథుడు, పార్శనాథుడు, మహావీరుల బొమ్మలు చెక్కి ఉన్నట్టు ఆయన చెప్పారు. ధ్యానముద్రలో నాలుగున్నర అడుగుల ఎత్తున్న వర్ధమాన మహావీరుని విగ్రహం తల, చేతులు విరిగిపోయాయి. రెండు శిల్పాలూ క్రీస్తుశకం 11వ శతాబ్దానికి చెందిన కల్యాణి చాళుక్యుల కాలంనాటివని శివనాగిరెడ్డి తెలిపారు. కొండపోచమ్మ గ్రామ చరిత్ర వెయ్యేళ్లనాటిదని చెప్పేందుకు ఇవి నిదర్శనమని, వీటిని భద్రపర్చాలని సర్పంచ్తోపాటు తెలంగాణ పురావస్తు శాఖకు విజ్ఞప్తిచేశారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, మహమ్మద్ నసీరుద్దీన్, కొరవి గోపాల్ తదితరులు శివనాగిరెడ్డితోపాటు శిల్పాలను పరిశీలించారు.