మెట్పల్లి రూరల్, ఆగస్టు 7: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్ అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలో గల అత్యంత ఎత్తయిన ఎల్బర్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. అక్కడ సూర్య నమస్కారాలు చేసి దేశ కీర్తిని దశదిశలా చాటాడు. ప్రవీణ్ తరచూ ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తూ, అక్కడ వివిధ ఉష్ణోగ్రతల వద్ద సూర్య నమస్కారాలు చేస్తూ యోగా శక్తిని ప్రపంచానికి చాటిచెబుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో యూఎస్లోని కొలోరాడో కాలమానం ప్రకారం ఈనెల 6న ఉదయం 4.30 గంటలకు ఎల్బర్ట్ పర్వతాన్ని అధిరోహించడం ప్రారంభించాడు. సుమారు ఆరు గంటలపాటు 16 కిలోమీటర్లు అధిరోహిస్తూ ఉదయం 10.20 గంటలకు పర్వతంపైకి చేరుకొన్నాడు. 4,401 మీటర్ల ఎత్తులో, 4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 33 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు పూర్తిచేశాడు. కాగా ఇప్పటి వరకు ప్రవీణ్ 20 ఎత్తయిన పర్వతాలను అధిరోహించి 108 సూర్య నమస్కారాలు చేయడం విశేషం.