మనోహరం ప్రకృతి రమణీయత
వనమూలికలకు అపర సంజీవని
ఏటా ఘనంగా హనుమాన్ జయంతి
దీక్షల సీజన్లో భక్తజన సందోహం
స్వరాష్ట్రంలో వేగంగా అభివృధ్ధి
అంజన్న కొలువైన కొండగట్టు ఓ ఆధ్యాత్మిక శిఖరమే కాదు… అందమైన ప్రకృతికి నెలవుగా వెలుగొందుతున్నది. ఆయుర్వేద మూలికావరణంతో ఆరోగ్య ప్రదాయినిగానూ పేరుపొందింది. నిత్యం విశిష్టపూజలతో అలరారే ఈ క్షేత్రం ఏటా దీక్షాధారుల రాకతో భక్తిసంద్రమౌతుంది.
జగిత్యాల, మార్చి 29 : కొండకోనల మధ్య వెలిసిన కొండగట్టు హనుమ క్షేత్రాల్లో ఆణిముత్యమై అలరారుతున్నది. ప్రకృతి రమణీయతతోపాటు, వనమూలికలకు నెలవుగా పేరుగాంచింది. దట్టమైన అడవుల మధ్య వెలిసిన ఈ క్షేత్రం శ్రావణ మాసం నుంచి వసంతం మధ్యకాలంలో పచ్చటి ప్రకృతి, అందమైన వనజీవులతో నయన మనోహరంగా కనిపిస్తుంటుంది. కొండగ ట్టు గుట్టల్లో ఒకప్పుడు మునులు తపస్సు చేసుకునేవారనే ప్రతీతి. ఇందుకు నిదర్శంగా మునుల గుహలు ఇప్పటికీ ఉన్నాయి. కొండగట్టుపై ఆయుర్వేదంలో ప్రస్తావించే వనమూలిక జాతులు అనే కం ఉన్నాయి. హిమాలయాలు, లంకలో ఉన్న సంజీవని పర్వతంపై కనిపించే బట్టి పునిక, రాగి హంస, పరమ హంస, మయూరి శిఖ, పిట్టకాలు వృక్షజాతులు ఇక్కడ పెరుగుతాయి. అనేక వనమూలికలకు నెలవైన ఈ క్షేత్రంలో శారీరకంగా, మానసికంగా అనారోగ్యంతో ఉన్నవారు నలభై ఒ క్కరోజుల (మండల కాలం) దీక్ష చేస్తే బాధల నుండి విముక్తం చెందుతారని భావిస్తారు.
వైభవోపేతంగా హనుమాన్ జయంతి
కొండగట్టు క్షేత్రంలో అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి, సత్యనారాయణస్వామి వత్రం, తలనీలాల సమర్పణ, వాహన పూజలు సర్వసాధారణం గా జరుగుతుంటాయి. పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు క్షేత్రం నిండైన ఆధ్యాత్మిక శోభ ను సంతరించుకుంటుంది. ఆ రోజుల్లో ఎటూ చూసిన కొండగట్టు కాషాయరంగును పులుముకుంటుంది. లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేసేందుకు వస్తుంటారు. చైత్ర పౌర్ణమి రోజున స్వామివారి చిన్నజయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంలో స్వామివారికి అభిషేకం, విశేషమైన పరిమళ వస్తువులచే అర్చనలు, సహస్ర నాగవల్లి దళ అర్చన, సహస్ర తులసీదళ అర్చన నిర్వహిస్తారు. ఈ సమయంలో లక్షల మంది భక్తులు మండల, అర్ధమండల, 11 రోజుల దీక్షలను స్వామివారి సన్నిధిలో విరమణ చేస్తుంటారు. ఇక ప్రతి ఏడాది వైశాఖ మాస బహుళ దశమి రోజున పూర్వాభాధ్ర నక్షత్రంలో స్వామివారి పెద్ద జయంతి ఉత్సవాలు ని ర్వహిస్తారు. ఆ సమయంలో అత్యంత వైభవంగా త్రైయాహ్నిక, త్రికుండాత్మక మహాయాగము, మూడురోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన, సహస్ర దీపాలంకరణ గరుడ వాహన సేవ తదితర కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
ఆలయ పరిధిలో ఆగమ పాఠశాల
కొండగట్టు అంజన్న ఆలయ పరిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సీజీఎఫ్ నిధులు, ఆలయ నిధులతో 2018-19 విద్యాసంవత్సరం నుండి శ్రీవైష్ణవ చాత్తాద ఆగమ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏడాది 30 నుండి 40 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న వేదపండితులే పాఠ్యాంశాల బోధనను నిర్వహిస్తున్నారు.
స్వరాష్ట్రం సిద్ధించాక వేగంగా అభివృధ్ధి పనులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొండగట్టు ఆలయంలో ఉన్న నీటి కొరతను తీర్చే దిశగా అడుగులు పడ్డాయి. సిరిసిల్ల-వేములవాడ- చొప్పదండి నియోజకవర్గాలకు తాగునీరు అందించే మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా 4.5 కోట్లతో ప్రత్యేక నీటిసంపును కొండగట్టు దిగువన నిర్మించారు. అక్కడి నుండి నీటిని కొండపైకి పంపింగ్ చేస్తున్నారు. కొం డగట్టు ఆలయ పరిధిలో పుష్కరిణిని 2.5 కోట్లు వెచ్చించి నూతనంగా నిర్మించారు. మెట్లదారి సుందరీకరణకు రూ.2.5 కోట్ల ప నులకు దేవాదాయ ధర్మాధాయశాఖ మం త్రి ఇంద్రకరణ్రెడ్డి శంకుస్థాపన చేశారు.