హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వయం ప్రతిపత్తి కలిగిన నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఐటీఐసీ ఇంక్యుబేటర్, టైహాన్ సంస్థల భాగస్వామ్యంతో స్టార్టప్ ఇంక్యుబేటర్ను ఏర్పాటుచేసింది. ఇటీవలే దేశవ్యాప్తంగా 6 స్టార్టప్లను ఎంపికచేసి, రూ.1 కోటి నిధిని సమకూర్చారు. ఈ స్టార్టప్లు చేసే పరిశోధనలకు ఐఐటీ హైదరాబాద్ పూర్తిస్థాయిలో సహకారం అందించనున్నది. ఐటీఐసీ ఇంక్యుబేటర్ ప్రతి ప్రొటోటైప్ రెడీ స్టార్టప్కు రూ.25 లక్షల చొప్పున పెట్టుబడిని అందిస్తున్నది. ఇప్పటికే యూఏవీఐవో ల్యాబ్, అలోగ్ టెక్ వంటి స్టార్టప్లు స్వయం ప్రతిపత్తి కలిగిన డ్రోన్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నాయి. వీటితో లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ రంగాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అవియాక్ స్టార్టప్ పర్యావరణ పర్యవేక్షణపై పనిచేసే డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నది. ప్రారంభ దశలోని స్టార్టప్లకు సైతం ఐటీఐసీ ఇంక్యుబేటర్ రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నది. ఈ విభాగంలో రొవొనైజ్, క్వాట్పార్స్ స్టార్టప్లు అత్యుతమ టెక్నాలజీని డ్రోన్ల వినియోగం కోసం అభివృద్ధి చేస్తున్నాయి. వీటితో వీడియో, ఫొటో అప్లికేషన్ను మరింత సమర్థంగా నిర్వహించే అవకాశం ఉంటుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. కొత్త టెక్నాలజీల అభివృద్ధికి ఐఐటీ హైదరాబాద్ అధిక ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. డ్రోన్ టెక్నాలజీపై ప్రసుత్తం జరుగుతున్న పరిశోధనలు సమాజంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టైహాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రొఫెసర్ రాజలక్ష్మి, ఫ్యాకల్టీ ఇంచార్జి ప్రొఫెసర్ సూర్యకుమార్, స్టార్టప్ల వ్యవస్థాపకులు పాల్గొన్నారు.