జహీరాబాద్, అక్టోబర్ 1: ఐటీబీపీ కానిస్టేబుల్ రివాల్వర్ జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో మాయమైంది. దీంతో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ సికిందర్ అలీ ఐటీబీపీలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవులు కావడంతో స్వగ్రామం సిర్గాపూర్కు వచ్చాడు. దర్గా దర్శనం కోసం కర్ణాటకలోని గుల్బర్గా వెళ్లి తిరిగి శనివారం ఉదయం జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్నాడు. జహీరాబాద్ బస్టాండ్లో దిగిన అతడు మూత్రవిసర్జనకు వెళ్తూ అక్కడి గోడపై రివాల్వర్ పెట్టి మర్చిపోయాడు. అదే సమయంలో నిజామాబాద్ బస్సు రావడంతో హడావుడిగా బస్కెక్కి బయల్దేరాడు. బస్సు నారాయణఖేడ్ చేరుకోగానే రివాల్వర్ పోగొట్టుకున్న విషయం గుర్తించాడు. వెంటనే జహీరాబాద్ బస్టాండ్కు వచ్చి చూసేసరికి రివాల్వర్ మాయమైంది. ఆర్టీసీ బస్టాండ్ మొత్తం రివాల్వర్ కోసం వెతికాడు. దొరక్కపోవడంతో జహీరాబాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.