హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్పార్లమెంటరీ భాషకు బ్రాండ్ అంబాసిడర్ అని, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ గురించి మాట్లాడటం మానేసి సీఎం భాష గురించి స్పందించాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి సూచించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియా తో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి మధ్య రహస్య మైత్రి కుదిరిందని ఆరోపించారు. త్వరలోనే దానిని బయటపెడతానని తెలిపారు.
కేటీఆర్ స్థాయి గురించి మల్లు రవి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అన్పార్లమెంటరీ భాష గురించి మాట్లాడాల్సి వస్తే తొలుత రేవంత్ గురించి మాట్లాడాలని సూచించారు. గతంలో ఎవరూ రేవంత్లా బజారు భాష మాట్లాడలేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నామన్న సోయి మరిచి రేవంత్ ఇంకా ఎన్నికల సభల్లో మాట్లాడినట్టే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సుమతీ శతకంలోని పద్యంతో కేటీఆర్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు తప్పితే రేవంత్ స్థాయికి దిగజారలేదన్నారు.
తెలంగాణకు దేశంలోనే అత్యుత్తమ పాలనా భవనాన్ని కేసీఆర్ అందించారని శ్రీధర్రెడ్డి కొనియాడారు. అలాంటి సచివాలయం జైలులా ఉందని మల్లు రవి మాట్లాడడం హాస్యాస్పదమని మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేసినా కాంగ్రెస్కు చెడుగానే కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదిస్తే తెలంగాణ మొత్తాన్ని జైలులా మార్చిన ఘనత కాంగ్రెస్దేనని విమర్శించారు. ప్రధాని మోదీని రేవంత్ కలిసిన తర్వాతే రాష్ట్రంలో పెట్టుబడులకు అదానీ ముందుకు వచ్చారని పేర్కొన్నారు. రాహుల్గాంధీ ఆదేశాలకంటే మోదీ ఆదేశాలనే రేవంత్రెడ్డి ఎక్కువగా పాటిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని శ్రీధర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.