హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి వాటిని పరిష్కరించేందుకు వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. ఇందుకు వర్సిటీ స్థాయిలో అంబుడ్స్మన్, ఉన్నత విద్యాసంస్థల్లో స్టూడెంట్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీలను ఏర్పాటుచేయాలని తెలిపింది. ఈ మేరకు కొత్త నిబంధనలను యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ శుక్రవారం విడుదలచేశారు. కులం, మతం, భాష, జాతి, లింగం ఆధారంగా విద్యార్థులు వివక్షకు గురికాకుండా ఉండేందుకే ఈ మార్గదర్శకాలను జారీచేశామని తెలిపారు. ఉన్నత విద్యాసంస్థలు కుల వివక్షను నివారించడానికి తీసుకున్న చర్యలను యాక్టివిటీ మానిటరింగ్ పోర్టల్లో నివేదించాలని సూచించారు.
ఫిర్యాదుల స్వీకరణకు వర్సిటీల్లో అంబుడ్స్మన్ వ్యవస్థను అమలుచేయాలి. ప్రతి వర్సిటీ తమ పరిధిలోని సమస్యల పరిష్కారానికి అంబుడ్స్పర్సన్ను నియమించాలి. స్టూడెంట్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీ నిర్ణయాలపై అంబుడ్స్మన్ వ్యవస్థకు ఫిర్యాదు చేయవచ్చు. రిటైర్డ్ వైస్చాన్స్లర్,/ రిటైర్డ్ ప్రొఫెసర్లను, డీన్, హెచ్వోడీగా 10 ఏండ్లకు పైగా బోధనానుభవంగల వారితోపాటు, రిటైర్డ్ జిల్లా జడ్జీని అంబుడ్స్పర్సన్గా నియమించవచ్చు. అంబుడ్స్పర్సన్ మూడేండ్లు లేదా 70 ఏండ్లు నిండటంలో ఏదీ ముందైతే దాని ప్రకారం పదవీ విరమణ పొందాలి.
డిగ్రీ ఆపై కోర్సులను నిర్వహిస్తున్న ఉన్నత విద్యాసంస్థల్లో స్టూడెంట్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీ(ఎస్జీఆర్సీ)ని ఏర్పాటు చేయాలి. ప్రొఫెసర్ ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. నలుగురు ప్రొఫెసర్లు/ సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల నుంచి మెరిట్ విద్యార్థి (చదువు, ఆటలు, సహపాఠ్య కార్యక్రమాల్లో) చురుగ్గా ఉన్న విద్యార్థిని ప్రత్యేక ఆహ్వానితుడిగా నామినేట్ చేస్తారు. కమిటీ చైర్మన్, లేదా సభ్యుల్లో ఒకరు మహిళ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాటగిరీల్లో ఒకరికి సభ్యుడిగా అవకాశం కల్పించాలి. ఈ కమిటీ కాల వ్యవధి రెండేండ్లు. ప్రత్యేక ఆహ్వానితుడి కాల వ్యవధి ఏడాది. ఈ కమిటీ విద్యార్థుల నుంచి ఆన్లైన్లో ఫిర్యాదులు స్వీకరించాలి. తమకు అందిన ఫిర్యాదును 15 రోజుల్లో పరిష్కారానికి మార్గదర్శకాలను సూచించాలి. ఈ కమిటీ సమస్యను పరిష్కరించని పక్షంలో అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయవచ్చు.