హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మిడ్ వైఫరీ వ్యవస్థ పనితీరు బాగున్నదని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘యునిసెఫ్’ ప్రశంసించింది. రాష్ట్రంలో సాధారణ ప్రసవాలు పెరగడంలో మిడ్ వైఫరీలు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నది. యునిసెఫ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా రాష్ట్రంలో మిడ్ వైఫరీ వ్యవస్థ పనితీరుపై అధ్యయనం చేశాయి. ఏడుగురు జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కూడిన ఈ బృందం ఈ ఏడాది ఫిబ్రవరి 3 నుంచి మే 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా 49 దవాఖానల్లో పర్యటించింది. ఈ బృందంలో అంతర్జాతీయ మిడ్వైఫరీ శిక్షకులు లైలా రుంబ్లే, జో ఆన్, జాతీయ మిడ్వైఫరీ శిక్షకులు శీతల్ శాంసన్, ప్రోగ్రాం మేనేజర్లు నీనా దొండపాటి, సౌమ్య తోట, దీపిక మర్పు, వినీల కెల్లూరు ఉన్నారు.
2017లో ప్రభుత్వం నియమించిన 217 మంది మిడ్ వైఫరీల 49 దవాఖానల్లో పనిచేస్తున్నారు.వీరి నియామకం వల్ల కలిగిన ప్రయోజనాలు, వారి పనితీరు తదితర అంశాలపై అధ్యయనం చేశారు. దవాఖానల్లో ప్రసవ సేవలకు వీరిని వినియోగిస్తున్నది. ఈ నేపథ్యంలో వారి పనితీరును యూనిసెఫ్ పరిశీలించింది. 49 కేంద్రాల్లో పనిచేస్తున్న మిడ్వైఫరీల నైపుణ్యాలను పరీక్షించి, ఫలితాలను నివేదికలో పొందుపరిచారు. 88 శాతం మంది మిడ్వైఫరీల్లో ఉత్తమ నైపుణ్యం ఉన్నట్టు గుర్తించారు. వైద్యం కోసం వచ్చే గర్భిణులకు మిడ్ వైఫరీలు చేసే వైద్య పరీక్షలు, వారి రిస్క్ క్యాటగిరీ గుర్తింపు, వారి సమస్యలను నిజాయితీగా గైనకాలజిస్ట్కు రెఫర్ చేసే అంశాలను సమగ్రంగా పరిశీలించారు.