హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనువైన ప్రాంతమని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. జర్మనీ-ఇండియన్ పార్లమెంటరీ స్నేహ సంబంధాల్లో భాగంగా రాల్ఫ్ బ్రింకాస్ నేతృత్వంలోని ఆరుగురు ఎంపీల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్నది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో జర్మనీ ఎంపీల బృందం మంత్రి కేటీఆర్తో సమావేశమైంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు, ఐటీ సహా ఇతర పరిశ్రమల స్థాపనకు టీఎస్-ఐపాస్ ఏ రకంగా దోహదకారి అవుతున్నదో వివరించారు. వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన పురోగతిని ఆయన వారికి వివరించారు. సమావేశంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి జగదీశ్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్, రవీంద్రకుమార్, నన్నపునేని నరేందర్, జైపాల్యాదవ్, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జర్మన్ ఇండియన్ పార్లమెంట్ సభ్యులను మంత్రి కేటీఆర్, స్పీకర్ పోచారం సత్కరించారు.