హైదరాబాద్ సిటీబ్యూరో,అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): బ్యాచిలర్ ఇంజినీరింగ్లో కంప్యూటర్స్ చదివితేనే ఐటీ కొలువులు వస్తాయన్న అభిప్రాయం చాలామందిలో ఉన్నది. కానీ ఇది నిజం కాదంటున్నారు ఐటీ రంగ నిపుణులు. ఇందుకు మెక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ను ఉదాహరణగా చూపుతున్నారు. సత్య నాదెండ్ల బ్యాచిలర్ డిగ్రీలో ఎలక్ట్రికిల్ ఇంజినీరింగ్, సుందర్ పిచాయ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ చదివిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇలా ఎంతోమంది బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ కాకుండా ఎలక్ట్రికిల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జికల్, సివిల్ ఇంజినీరింగ్ తదితర బ్రాంచీల్లో చదివినప్పటికీ ఐటీలో కొలువులు చేస్తున్నారని చెప్తున్నారు.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగానికి టెక్నాలజీ మీద పట్టు ఉండటమే ప్రధానమని, డిగ్రీలు కాదని స్పష్టంచేస్తున్నారు. ఐటీ ఉద్యోగంలో చేరేందుకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే చాలు అని కంపెనీలు కూడా పేర్కొంటున్నాయి. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారిలో బీఎస్సీ, ఎమ్మెస్సీ చేసినవారు సైతం ఎందరో ఉన్నారని చెప్తున్నారు. అయినప్పటికీ, ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్కే క్రేజీ నెలకొన్నది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజినీరింగ్ లాంటి కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా వేలాది ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోతున్నాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లే ఇందుకు తాజా ఉదాహరణ.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే చాలు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం.. 2025 నాటికి ఐటీ జాబ్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో 97 లక్షల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ టెక్నాలజీని ఎవరైనా సులభంగా నేర్చుకొనే వీలున్నది. అందుకే చాలా ఇంజినీరింగ్ కాలేజీల్ల్లో సీఎస్ఈ, ఐటీతోపాటు ఏఐ, ఎంఎల్ బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా ఇంజినీరింగ్ బ్రాంచిలో డిగ్రీ ఉండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో నైపుణ్యం ఉంటే చాలు ఐటీ రంగంలో ఉద్యోగం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు ఇతర ఐటీ కోర్సుల్లోనూ నైపుణ్యం ఉంటే ఐటీ రంగంలో ఉద్యోగాలకు కొదవ లేదు. కావాల్సిందల్లా సంబంధింత టెక్నాలజీల్లో సంపూర్ణ అవగాహన, ప్రాజెక్టులను పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉండటమేనని ఐటీ నిపుణులు చెప్తున్నారు.
ఇంజినీరింగ్ కాలేజీల్లో మిగిలిన సీట్లు 15,447
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో కలిపి మొత్తం 79,346 సీట్లు ఉండగా, ఇటీవల ముగిసిన కౌన్సెలింగ్లో 63,899 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 15,447 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సివిల్, మెకానికల్ బ్రాంచీల్లోనే 6,958 సీట్లు (68%) మిగిలిపోయాయి. ఈ పరిస్థితికి విద్యార్థులు, తల్లిదండ్రులు కంప్యూటర్ సైన్స్ మీదనే ఆసక్తి చూపిస్తుండటమే ప్రధాన కారణం. రాష్ట్రంలో కంప్యూటర్స్ సీటు రాకపోతే ఇతర రాష్ర్టాల్లోని ప్రైవేట్ కాలేజీలను ఆశ్రయిస్తున్నారు.
ఎక్కువ ఉద్యోగావకాశాలు ఐటీలోనే
ప్రస్తుత జాబ్ మార్కెట్లో 80% మంది ఐటీ రంగం అంటేనే ఆసక్తి చూపుతున్నారు. ఐటీలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటం, అత్యధిక వేతనాలు లభిస్తుండటం, వారానికి 5 రోజుల పనిదినాలు ఇందుకు కారణం. వీటికితోడు దేశ, విదేశాల్లో ఎక్కడికైనా వెళ్లేందుకు అత్యంత అనుకూలమైన ఉద్యోగం ఐటీ. దీంతో కంప్యూటర్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్కే విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కారణాలతోనే ఇంజినీరింగ్ కాలేజీల్లో సివిల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఐటీ కంపెనీలు ఉద్యోగుల నియామకంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఏదైనా.. కోడింగ్ నైపుణ్యం, ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీల్లో పట్టు ఉన్నదా? లేదా? అన్న విషయాలను పరిగణనలోకి తీసుకొంటారు. -సందీప్కుమార్ మక్తల, ఐటీ నిపుణులు
ట్రెండింగ్లో ఉన్న ఐటీ కోర్సులు