Koyna project | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): తాగునీటి కోసం మహరాష్ట్ర, కర్ణాటకను సంప్రదించాలని ఉరుకులు పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఆ దిశగా వివరాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. కృష్ణా బేసిన్లో నీటికొరత ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారును సంప్రదించి కొయినా డ్యామ్ నుంచి 30 టీఎంసీలు, కర్ణాటక సర్కారును సంప్రదించి 10 టీఎంసీలను కోరాలని సర్కారు నిర్ణయించింది. అందుకు సంబంధించి ప్రతిపాదనలను సైతం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే కోయినా నుంచి నీళ్లు తెచ్చుకోవడం పెద్ద సవాల్ అని, ఖర్చుతో కూడిన వ్యవహారంతోపాటు, అందే ప్రయోజనాలు తక్కువేనని అధికారులు సర్కారుకు నివేదించారు.
రాష్ట్రంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం సచివాలయంలో సాగునీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా, ఈఎన్సీ మురళీధర్తో ప్రత్యేక సమీక్ష నిర్వహించారని సమాచారం. తాగునీటిని అందించేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించారని తెలుస్తున్నది. గతంలో సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి ఎన్ని నీళ్లను వినియోగించుకున్నాం? ఏయే సందర్భాల్లో ఏ మేరకు జలాలను ఎత్తిపోసుకున్నాం? అందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై పూర్తిస్థాయి వివరాలను అందివ్వాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టి హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులను సంప్రదించినట్టు తెలుస్తున్నది.