హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ అధికారులు రాష్ట్రంలో వరుసగా దాడులు (IT Raids) నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో సోదాలు చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని బడా వ్యాపారులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానులతోపాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇండ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. షానవాజ్ ఇంటితోపాటు పలువురి ఇండ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.
కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లలో ఫంక్షన్లు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్తలు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బులు సమకూర్చుతున్నట్లు సమాచారం అందడంతోనే ఐటీ అధికారులు ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఈ ఏడాది మే నెలలో కూడా కోహినూర్ గ్రూప్ ఎండీ ఇండ్లు, కార్యాలయాలతోపాటు గ్రూప్లోని పలు హోటళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓల్డ్సిటీ, దాని చుట్టుపక్కల 30 ప్రాంతాల్లో ఉన్న కోహినూర్ గ్రూప్కు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.