హైదరాబాద్/మంచిర్యాల, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జ్యోతినగర్/జమ్మికుంట: అసెంబ్లీ ఎన్నికల వేళ డబ్బునే నమ్ముకున్న నేతలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఈడీ ఆదేశాలు, సమాచారం మేరకు ఇన్కం ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి నివాసాల్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్తోపాటు ఆయన పోటీ చేస్తున్న చెన్నూరులో కూడా తనిఖీలు చేపట్టారు. చెన్నూరులోని వివేక్ ఇంటికి తెల్లవారుజామున 5.30 గంటలకు చేరుకున్న ఈడీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది.
వివేక్కు చెందిన కంపెనీల డబ్బులను చెన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్టు తెలిసింది. ఆ సమయంలో నివాసంలో వివేక్ లేకపోవడంతో ఇంటి వాచ్మెన్ సమక్షంలో తనిఖీలు చేశారు. ఇటీవల ఫ్రీజ్ చేసిన రూ.8 కోట్ల లావాదేవీలపై కూడా అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు వివేక్ నివాసానికి చేరుకొని నిరసన తెలిపారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలీసులు వారిని చెదరకొట్టారు. సోదాలు నిర్వహించిన తర్వాత పంచనామా కాపీని వాచ్మెన్కు అందజేసి వెళ్లిపోయారు. హైదరాబాద్ నివాసంలో కూడా సుమారు 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు విలువైన డాక్యుమెంట్లు, డిజిటల్ వస్తు సామగ్రి, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వర్గీయులదిగా భావిస్తున్న రూ.7.5 కోట్లపై ఐటీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. ఈడీ అధికారికంగా రంగంలోకి దిగనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ కేసులో అజీజ్నగర్ రెవెన్యూలో ఉన్న శ్రీనిధి ఇంటర్నేషనల్ చైర్మన్ కేటీ మహేందర్ వాంగ్మూలం కీలకంగా మారున్నది.
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట కాటన్ మిల్లుల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మిల్లుల్లో భాగస్వాములైన ముక్కా శివకుమార్, ముక్కా నారాయణ నివాసాల్లోనూ సోదాలు చేశారు. మరికొందరు భాగస్వాములను ఆదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఆర్నెళ్లుగా సదరు వ్యాపారులు ఎక్కువ మొత్తంలో నగదు డ్రా చేసి ఓ పార్టీకి చెందిన నేతకు నిధులు సమకూర్చారనే ఆరోపణల నేపథ్యంలో దాడులు చేపట్టి తెలుస్తున్నది. నాలుగు వాహనాల్లో 10 మందికిపైగా ఐటీ అధికారులు, సిబ్బంది కేంద్ర బలగాల సిబ్బంది సహాయంతో జమ్మికుంటకు వచ్చినట్టు తెలిసింది. ఇంట్లో ఉన్న వ్యక్తుల, మిల్లులోని సిబ్బంది వద్ద ఉన్న సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డోర్లు, మిల్లు గేట్లను మూసేశారు. ఆయా మిల్లుల్లో ఐటీ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.