హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఎన్నికల రోడ్ షోలు, ర్యాలీల్లో పటాకులు పేల్చడానికి అనుమతి లేదని కేంద్రం ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది.
ఒక అకౌంట్ నుంచి లక్ష రూపాయలు డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసిన ఆ వివరాలను అందించాలని బ్యాంకులకు ఎన్నికల సంఘం సూచించింది. ఒక బ్యాంకు అకౌంట్ నుంచి అనేక బ్యాంకు అకౌంట్లకు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు జమ చేస్తుంటే వాటి సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. అభ్యర్థి లేదా ఆయన కుటుంబ సభ్యులు ఏవరైనా లక్ష రూపాయల కంటే ఎక్కువగా నగదు డ్రా చేసి ఉంటే ఆ సమాచారాన్ని అందించాలని ఆదేశించింది. రాజకీయ పార్టీల అకౌంట్ల నుంచి ఒక లక్ష రూపాయలు జమ చేయడం, డ్రా చేయడం చేస్తే వాటి వివరాలను అందించాలని తెలిపింది. ఈ మేరకు మంగళవారం బ్యాంకుల ప్రతినిధులకు ఈసీ లేఖ రాసింది.
పోలింగ్ రోజున విధుల్లో ఉండే 13 అత్యవసర శాఖల ఉద్యోగులకు పోస్టల్ ఓటు హక్కును ఈసీ కల్పించింది. ఎన్నికల రోజు విధుల్లో ఉండే జర్నలిస్టులు సైతం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
ఎయిర్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్, కుటుంబం, వైద్య సంక్షేమం, ఆర్టీసీ, సివిల్ సప్లయ్, బీఎస్ఎన్ఎల్, పోలింగ్ రోజు ఎన్నికల్లో విధుల్లో ఉండే మీడియా ప్రతినిధులు, ఫైర్ సర్వీసెస్.