పటాన్చెరు, ఫిబ్రవరి 24: గగన్యాన్ యాత్ర దేశ సైంటిస్టుల కల. ఆ కలను నిజం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది ఇస్రో బృందం. దేశ శాస్త్ర పరిజ్ఞానాన్ని లోకానికి చాటేందుకు సొంత టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న ఇస్రో బృందానికి అవసరమైన యంత్రాన్ని తయారుచేసి ఇవ్వడంలో హైదరాబాద్ సమీపంలోని పారిశ్రామికవాడలు అండగా నిలుస్తున్నా యి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామ పరిధిలోని మంజీర మెషిన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో తయారైన సిమ్యులేటెడ్ క్రూ మాడ్యుల్ (ఎస్సీఎం) పరికరాన్ని శుక్రవారం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వర్చువల్గా చూస్తుండగా, వీఎస్ఎస్సీ డైరెక్టర్ ఉన్నికృష్ణన్ ఆవిష్కరించారు. గగన్యాన్ యాత్రలో భాగం గా స్పేస్కు పంపించిన వ్యక్తులను భూమిపైకి చేర్చే క్రమంలో ఎస్సీఎం పరికరం అత్యవసరం.
పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మంజీర పరిశ్రమ ఆరునెలల్లోనే దీన్ని తయారుచేసి ఇస్రోకు అందజేసింది. రాకెట్పై గోళాకారంలో ఉండే ప్రత్యేక క్యాబినే క్రూ మాడ్యుల్. గడువులోగా చక్కటి నైపుణ్యంతో నాణ్యమైన మాడ్యుల్ను అందజేసిన మంజీర మెషిన్ బిల్డర్ పరిశ్రమ ఎండీ సాయిప్రకాశ్ను ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అభినందించారు. గగన్యాన్ యాత్రపై యావత్ దేశం ఆసక్తితో ఉన్నదని, ఇది శాస్త్రవేత్తలకు పెద్ద చాలెంజ్ అని పేర్కొన్నారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ.. ఈ మాడ్యుల్కు మూడు బెలూన్స్ ఉంటాయని, స్పేస్ నుంచి భూమిపైకి చేరే క్రమంలో అవి విచ్చుకొని దానిలో ఉన్న వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి చేరుకుంటారని, ఇంకా అనేక దశల్లో దీనికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇస్రో తలపెట్టిన గగన్యాన్ మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఇస్రోకు అవసరమైన అతి ముఖ్యమైన పరికరాన్ని తమ సంస్థలో తయారు చేసినందుకు ఎంతో ఆనందంగా ఉన్నదని మంజీర మెషిన్ బిల్డర్స్ పరిశ్రమ ఎండీ సాయిప్రకాశ్ తెలిపారు. మానవ సహిత రాకెట్లను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో చేపట్టిన గగన్యాన్ యాత్రలో తాము భాగమైనందుకు గర్వంగా ఉన్నదని అన్నారు.