హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. ఈ నెల 29న ఉదయం 10.42 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీఎఫ్12 రాకెట్ను ప్రయోగించనున్నారు. దీనిద్వారా 2,232 కిలోల బరువు ఉన్న ఎన్వీఎస్-01 నావిగేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకొంటున్నది. దేశ సరిహద్దులో 1,500 కిలోమీటర్ల మేర నావిక్ కవరేజ్ ఉండేవిధంగా ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇప్పటికే 7 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించి నావిగేషన్ వ్యవస్థను పటిష్టపరిచింది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే 12 ఏండ్ల పాటు సేవలందించనున్నది.