KTR | రాహుల్ గాంధీ భ్రమలో ఉన్నారా…? తెలంగాణ ప్రజలతో డ్రామా ఆడుతున్నారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వేయని రైతు భరోసా వేసినట్లు.. ఎందుకీ అబద్ధాలు? ఎంతకాలం ఈ అసత్యాలు అని నిలదీశారు. ఎక్కడన్నా ఒక్క రైతుకైనా ఎకరానికి రూ.7500 వచ్చిందా? అని ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా ప్రశ్నించారు. నాట్ల నాడు ఇయ్యాల్సిన పెట్టుబడి సాయాన్ని పార్లమెంట్ ఓట్ల దాకా.. డైలీ సీరియల్లా సాగదీశారని కేటీఆర్ మండిపడ్డారు. చివరికి పాత రైతుబంధు పూర్తిగా అందలేదని.. రైతు భరోసాకైతే అసలు అడ్రస్సే లేదని విమర్శించారు.
నాడు 15 లక్షలు వేస్తానన్న బడాభాయ్ వేయలేదని.. నేడు 15 వేలు ఇస్తానన్న ఛోటాబాయ్ ఇయ్యలేదని కేటీఆర్ విమర్శించారు. మరి రైతు భరోసా వేసినట్టు ఎందుకీ ఫోజులు ? అసత్యాలపై కాంగ్రెస్ స్వారీ.. ఇంకెన్ని రోజులు అని మండిపడ్డారు. డిసెంబర్ 9న చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ జాడేది అని ప్రశ్నించారు. కౌలు రైతులకు, కూలీలకు చేస్తామన్న సాయం సంగతేదని నిలదీశారు. ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన అని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన పాపానికి ఏంటి ఈ నయవంచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన కాదని.. ముమ్మాటికీ ఇది ప్రజా వ్యతిరేక పాలన అని స్పష్టం చేశారు. 420 మోసపూరిత వాగ్దానాలతో.. నాలుగుకోట్ల ప్రజలను వంచించిన పాలన అని విమర్శించారు.
గాలి మాటల గ్యారంటీలను నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఆగమైందన్న మాట మాత్రం నిజమని కేటీఆర్ అన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాచైతన్యం వెల్లివిరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక BRS వైపే ప్రజా తీర్పు ప్రతిధ్వనిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.