హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఈ యాసంగిలో రాష్ట్రంలో 23 భారీ ప్రాజెక్టులు, 35 మధ్యతరహా ప్రాజెక్టుల కింద 32.8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ (స్కైవమ్) నిర్ణయించింది. ఈఎన్సీ (జనరల్) మురళీధర్ నేతృత్వంలోని కమిటీ మంగళవారం జలసౌధలో సమావేశమైంది.
ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు నీటిని విడుదల చేయాలో నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో.. భారీ ప్రాజెక్టుల ద్వారా సుమారు 29 లక్షల ఎకరాలు, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని భావిస్తున్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం 342 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ప్రణాళిక రచించారు.