మహదేవపూర్/కాళేశ్వరం/కేతేపల్లి, జూలై 4: కాళేశ్వరం ప్రాజెక్ట్లోని లక్ష్మీ బరాజ్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బ్యారేజీకి ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి బరాజ్లోకి వరద పెరిగింది. బ్యారేజీ పూర్తి నిల్వ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.6 టీఎంసీలు ఉన్నది. ఆదివారం 14,210 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా సోమవారం 45,580 క్యూసెక్కులకు పెరిగింది. అవుట్ఫ్లో 43,530 క్యూసెక్కులుగా నమోదైంది. 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్టు డీఈ సురేశ్, ఏఈ షేక్వలీ తెలిపారు. బరాజ్కు దిగువ ఉన్న గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నది. కాళేశ్వరం పుష్కరఘాట్ను ఆనుకొని 6.30 మీటర్ల ఎత్తులో నీరు పారుతుండగా 45,850 క్యూసెక్కుల వరద వస్తున్నట్టు అధికారులు తెలిపారు. మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 1042.96 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 638.70 (2.92 టీఎంసీలు) అడుగులు ఉన్నట్టు ఏఈ డీ ఉదయ్కుమార్ తెలిపారు.