హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : మొదటి దశలో చేపట్టిన చెక్డ్యామ్ల నిర్మాణాలన్నింటినీ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఆదేశించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వాగుల పునరుజ్జీవంలో భాగంగా ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి సుమారు రూ.3825 కోట్ల నిధులతో 1200 చెక్డ్యామ్లను నిర్మించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడతలో మొత్తంగా 636 చెక్డ్యామ్ల నిర్మాణాలను ప్రారంభించింది.
అందులో 484 చెక్డ్యామ్ల నిర్మాణానికి నాబార్డు సంస్థ రూ.2016 కోట్ల నిధులు సమకూర్చింది. తాజాగా నాబార్డు ఆధ్వర్యంలో చేపట్టిన ఆయా చెక్డ్యామ్ల పనులపై గురువారం జలసౌధ నుంచి ఈఎన్సీ ప్రత్యేకంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో టెరిటోరియల్ వారీగా పనుల పురోగతిని చీఫ్ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా చెక్డ్యామ్ల్లో ఇప్పటికే 246 పూర్తయ్యాయని, మిగిలినవి తుది దశకు చేరుకున్నాయని అధికారులు వివరించారు. కొత్తగూడెం, మంచిర్యాల టెరిటోరియల్ పరిధిలో 100% పనులు పూర్తికావడంపై ఈఎన్సీ అభినందించారు. 9 టెరిటోరియల్స్ పనుల్లో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రూ.1800 కోట్లకు పైగా సంబంధించి పనులు పూర్తయినా అందులో కేవలం రూ.1500 కోట్లకు సంబంధించిన బిల్లులను మాత్రమే సమర్పించడంపై మండిపడ్డారు.
ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) ఆధ్వర్యంలో గతంలో చేపట్టిన చిన్న, మధ్యతరహా లిఫ్ట్ స్కీమ్లపైనా ఈఎన్సీ సమీక్షించారు. 640కు పైగా లిఫ్ట్లుండగా, పాక్షికంగా పని చేస్తున్నవి, పూర్తి గా నిలిపేసిన లిఫ్ట్లపై చర్చించారు. కొత్తగా వచ్చిన మరో 50 లిఫ్ట్ల ప్రతిపాదనలపై సమీక్షించారు.