హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ డ్రైనేజీ (ఐసీఐడీ) కాంగ్రెస్ను నవంబర్ 1 నుంచి 8 వరకు ఏపీలోని విశాఖలో నిర్వహించనున్నట్టు ఐసీఐడీ వైస్ ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి తెలిపారు. నీటి సంరక్షణలో అపూర్వ విజయాలు నమో దు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కూ డా నిర్వహణలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని జలసౌధలో రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ను కలిసి సదస్సు విజయవంతానికి సహకారం అందించాలని కోరారు.
‘వ్యవసాయ సాగులో నీటి ఎద్దడి నివారణ’ అనే థీమ్తో నిర్వహించనున్న ఈ సదస్సుకు 500 మందికిపైగా విదేశీ ప్రతినిధులు, దేశంలోని 750 మందికిపై సాగునీటి రంగ నిపుణులు హాజరవుతారని చెప్పారు. విశాఖలో 57 ఏండ్ల తరువాత ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఐసీఐడీ వారసత్వ సాగునీటి ప్రాజెక్టులకు అవార్డులను కూడా అందిస్తున్నదని, 2018లో తెలంగాణకు చెందిన సదర్మట్, పెద్దవాగు ప్రాజెక్టులకు అవార్డులు లభించాయని గుర్తుచేశారు. ఈఎన్సీని కలిసిన వారిలో ఐసీఐడీ కాన్ఫరెన్స్ కమిటీ డైరెక్టర్ గిరిధర్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేశ్కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే ఉన్నారు.