హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, అమలు చేస్తున్న రైతుబీమా పథకానికి అర్హులైన రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఇప్పటివరకు బీమా పరిధిలోకి రాని అర్హులైన రైతులు ఆగస్టు 1వ తేదీలోగా స్థానిక ఏఈవోలకు తమ దరఖాస్తులను అందజేయాలని సూచించింది. తమ పేరుపై ఎంతో కొంత భూమి గల 18-59 ఏండ్ల మధ్య వయస్సు గల రైతులు ఈ పథకానికి అర్హులని తెలిపింది. 2022-23 ఏడాది బీమా ప్రీమియంను ఎల్ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో చెల్లించనున్నది. ఈ నేపథ్యంలో కొత్త రైతులను కూడా బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నది. భూముల కొనుగోళ్లు, వారసులు ఆస్తులు పంచుకోవడం తదితర కారణాల వల్ల ఈ ఏడాది రైతుల సంఖ్య సుమారు 5-7 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. గత సంవత్సరం ప్రభుత్వం 35.64 లక్షల మంది రైతులకు బీమా పాలసీ చేయించింది. ఇప్పుడు ఈ సంఖ్య 40 లక్షలు దాటుతుందని అంచనా.
నాలుగేండ్లలో రూ.4 వేల కోట్ల ప్రీమియం
రైతులు ఏ కారణంతో మరణించినా సరే ఆ రైతు కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. మరణించిన రైతు కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున బీమా పరిహారం అందించడం ఈ పథకం ఉద్దేశం. బీమా ప్రీమియం కింద రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేండ్లలో రూ.3,937.24 కోట్లను ఎల్ఐసీకి చెల్లించింది. గత సంవత్సరం ఒక్కొక్క రైతుకు రూ.4,110.11 చొప్పున ప్రీమియంను చెల్లించడం గమనార్హం. ఈ ఏడాది ప్రీమియం మొత్తం మరింత పెరిగే అవకాశం ఉన్నది.