రాజన్న సిరిసిల్ల, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): నేతన్నలను యజమానులుగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్కర్ టు ఓనర్ స్కీం అద్భుతమని తెలంగాణ పవర్లూం టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ కొనియాడారు. శుక్రవారం సిరిసిల్లలోని పెద్దూరు రెండో బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆప్పారెల్ పార్కు, వర్కర్ టు ఓనర్ పథకం కింద ఏర్పాటు చేసిన మరమగ్గాల శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అప్పారెల్ పార్కులోని గోకల్ దాస్ యూనిట్లో తయారవుతున్న రెడీమేడ్ వస్ర్తాలను పరిశీలించారు. నేతన్నల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. రూ.387 కోట్లతో గ్రూప్ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నట్టు తెలిపారు. వ్యవసాయం తర్వాత కీలకమైన టెక్స్టైల్స్ రంగానికి సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే సిరిసిల్ల టెక్స్టైల్స్, అప్పారెల్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. వేలాది మందికి ఉపాధి లభించేందుకు చొరవ చూపుతున్న మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.