హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చటమే పనిగా పెట్టుకొని కుట్రలు పన్నుతున్నదని మేధావులు విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను డబ్బు మూటలు ఎరవేసి కూల్చి నియంత రాజ్యాన్ని తెస్తున్నారని ఆగ్రహం వక్తంచేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఓయూజేఏసీ-టీఎస్జేఏసీ ఆధ్వర్యంలో ‘కేంద్ర ప్రభుత్వం-రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం’ అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినా, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినా, సంక్షేమ పథకాల అమలుకు అడ్డుతగిలినా, రాజ్యాంగాన్ని మార్చాలని చూసినా ప్రజలు తిరగబడటం ఖాయమని హెచ్చరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ కుట్రకు తెరలేపారని విరుచుకుపడ్డారు.
బీజేపీ నేతలకు జాతీయ భావం ఉంటే రాజ్యాంగాన్ని అన్ని అధికార భాషల్లోకి అనువదించి ప్రతి గ్రామపంచాయతీలో పెట్టాలని కాంగ్రెస్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. సీపీఐ నేత బాలమల్లేశ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ నిత్యం కుట్రలు చేస్తూ పాలనను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై సీఎం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తున్నారని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత జేవీ చలపతిరావు అన్నారు. గుజరాత్ నమూనా అంటే హింసావాదం మాత్రమేనని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్ విమర్శించారు. గ్రామ స్వరాజ్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ నేతలు కంకణం కట్టుకున్నారని ఓయూజేఏసీ-టీఎస్జేఏసీ చైర్మన్ భాస్కర్ ఆరోపించారు. సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, నరేశ్జాదవ్, ఆప్ రాష్ట్ర కన్వీనర్ ఇందిరాశోభన్, తెలంగాణ లోక్సత్తా నేత నాగరాజు, పీడీఎస్యూ అధ్యక్షుడు శ్రీనివాస్, గిరిజన విద్యార్థి సంఘం నేత రవీంద్రనాయక్, విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు ఎల్చాల దత్తాత్రేయ, ఏపీ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ జేటీ రామారావు, టీవీఎస్ నేత హరీశ్గౌడ్, జేఏసీ నాయకులు ఎర్రబెల్లి జగన్, బానునాయక్, చిరంజీవి బెస్త, రాజశేఖర్గౌడ్, సురేశ్నాయక్, జితేంద్రపటేల్, ఉపేందర్, జగన్, అశోక్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.