దావోస్ చర్చా గోష్ఠిలో కేటీఆర్
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): భారత్ శీఘ్రంగా అభివృద్ధి చెందాలంటే దేశంలో ఇన్నోవేషన్ కల్చర్ (ఆవిష్కరణల సంస్కృతి) పెరగాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిత్యం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి దేశం వేగంగా ముందుకు సాగాలంటే ‘ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్’ (3ఐ) అనే సూత్రాన్ని అనుసరించాలని తెలిపారు.
ఇన్నోవేషన్ అంటే కేవలం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమే కాదని, మానవ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు పరిషారాలు ఇవ్వగలిగే శక్తి అని పేర్కొన్నారు. దావోస్లో జరుగుతున్న డబ్లూఈఎఫ్ సమావేశాల్లో భాగంగా గురువారం భారత స్టార్టప్ రంగంలో అద్భుత విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులతో నిర్వహించిన చర్చా గోష్ఠిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టం బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను పంచుకొన్నారు.