హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ(ఎఫ్సీఆర్ఐ) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్(సేంద్రియ)తేనెను ఆమె సోమవారం ఆవిషరించారు. రైతులకు తేనెటీగల పెంపకం, ఆదాయ అభివృద్ధిపై శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ శివారు ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజీలో ప్రత్యేక తేనెటీగల పెంపకం, ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పినట్టు చెప్పారు. రైతులతో పాటు ఔత్సాహిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మహిళలకు తేనెటీగల పెంపకంపై వారం రోజుల శిక్షణా కార్యక్రమాలను ఫారెస్ట్ కాలేజీ అందిస్తున్నదని వెల్లడించారు. సేంద్రియ పద్ధతుల్లో అభివృద్ధి చేసిన తేనెను ‘వైల్డ్ ఫ్లేవర్స్’ బ్రాండ్ పేరిట ఫారెస్ట్ కాలేజీ అందుబాటులోకి తెస్తున్నదని వివరించారు. ములుగు ఫారెస్ట్ కాలేజ్లో త్వరలో ఒక తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు డీన్ ప్రియాంక వర్గీస్ తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు.