హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థి, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) ముందుకొచ్చింది. సర్కారు కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. ఇంటర్ చదువుతున్న వారితో పాటు డ్రాపౌట్ అయినవారికోసం వీటిని ఏర్పాటు చేసేందుకు సంస్థ చొరవ తీసుకొన్నది. ఎన్ఎస్డీసీ ప్రతినిధులు ఇటీవలే ఇం టర్ విద్య అధికారులను కలిసి నైపుణ్యశిక్షణ వివరాలను వెల్లడించారు. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆయా కాలేజీల్లో స్వల్పకాలిక వృత్తి విద్యాకోర్సులను నిర్వహిస్తారు. ఆయా కోర్సుల్లో చేరిన వారికి ఇంటర్న్షిప్/ అప్రెంటీస్షిప్కు అవకాశం కల్పిస్తారు.
ఇంటర్న్షిప్కు ఎంపికైతే గరిష్ఠంగా రూ. 10వేల వరకు ైస్టెపెండ్, పారితోషికం లభిస్తుందని ఎన్ఎస్డీసీ వర్గాలు అధికారులకు తెలిపాయి. ఇటీవలీకాలంలో నైపుణ్యశిక్షణ లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్సులు చదివినా.. పట్టాలు పుచ్చుకొన్నా.. ఉద్యోగాలు లభించలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఏడాది, ఆరు మాసాలు, మూడు మాసాల వ్యవధి గల స్వల్పకాలిక కోర్సులను ఎన్ఎస్డీసీ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ విద్యాసంవత్సరం డిగ్రీలో అప్రెంటీస్షిప్ ఎంబీడెడ్ కోర్సులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని 40 డిగ్రీ కాలేజీల్లో 15కు పైగా కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. విద్యార్థులు ఒక వైపు డిగ్రీ చదువుతూనే.. మరోవైపు సంపాదిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా ఇంటర్ విద్యలోను ఇలాంటి కోర్సుల నిర్వహణకు ఎన్ఎస్డీసీ ముందుకొచ్చింది. ఈ కోర్సులను రాబోయే జూన్ నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు సైతం ఈ కోర్సుల్లో చేరవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ను జారీచేస్తారు.