అశ్వారావుపేట, జూలై 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. పార్టీ కోసం కష్టపడుతున్నా తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ పలువురు నాయకులు డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను నిలదీశారు.
ఓబీసీ మండల అధ్యక్షులను ప్రకటిస్తుండగా ఎంపీటీసీ వేముల భారతీ, ఊట్లపల్లి నాయకుడు సత్యం రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీలో చర్చించకుండా పదవులు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. దీంతో డీసీసీ అధ్యక్షుడు అసంతృప్త నాయకులను సముదాయించారు. కాంగ్రెస్లో గ్రూపులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయని.. సుభాశ్ చంద్రబోస్, మహాత్మ గాంధీలు వర్గాలుగా పనిచేశారని పొదెం వీరయ్య గుర్తుచేశారు. అయినా గొడవ సద్దుమణగక పోవడంతో సమావేశం పూర్తయ్యిందంటూ మీడియాను వెళ్లిపోవాలని సూచించారు. గన్మెన్లకు పాత్రికేయులను పంపించాలని ఆదేశించారు.