ప్రైవేట్ కాలేజీల అనుమతుల్లో వెసులుబాటు
క్యాబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్
మార్గదర్శకాలు సిద్ధంచేసిన బోర్డు
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ (ఇంటర్మీడియట్) కాలేజీల అనుబంధ గుర్తింపును ఏడాది నుంచి మూడేండ్లు లేదంటే ఐదేండ్లకు పొడిగించే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. మూడు లేదా ఐదేండ్లకు అనుమతులిచ్చేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఇంటర్ బోర్డు అధికారులు ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఏటా అనుబంధ గుర్తింపును జారీచేస్తున్నారు. కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వడం లేదు కానీ, ఉన్న కాలేజీలకే గుర్తింపును పొడిగిస్తున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న కాలేజీలు ఏటా దరఖాస్తులు సమర్పించి, అనుబంధ గుర్తింపు పొందుతున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం గుర్తింపు ప్రక్రియ కారణంగా అడ్మిషన్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. కొన్నిసార్లు పరీక్ష ఫీజులు చెల్లించే వరకు అనుబంధ గుర్తింపు లేకుండానే కాలేజీలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుబంధ గుర్తింపును మూడేండ్లు లేదా ఐదేండ్లకు పొడిగించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు కోసం ఇప్పటివరకు 1,408 జూనియర్ కాలేజీలు దరఖాస్తులు సమర్పించాయి. రాష్ట్రంలో 1,699 కాలేజీలుండగా, 291 కాలేజీలు దరఖాస్తు చేయలేదు. రూ.20 ఫైన్తో ఈ నెల 17 వరకు దరఖాస్తుకు అవకాశమున్నది. అనుబంధ గుర్తింపును మూడేండ్లు లేదా ఐదేండ్లకు పొడిగిస్తే అటు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యాలకు రెండింటికి లాభం చేకూరుతుందని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు గౌరీసతీశ్ తెలిపారు.