హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయి. సోమవారం ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఫస్టియర్ పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండియర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలుంటాయి. జనరల్ కోర్సులకే ఈ షెడ్యూల్ వర్తిస్తుందని, వొకేషనల్ విద్యార్థులకు ప్రత్యేక పరీక్షల షెడ్యూల్ను విడుదల చేస్తామని నవీన్మిట్టల్ తెలిపారు.
ఇంటర్లోని జనరల్, వొకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. సెలవు రోజైన ఆదివారాల్లోనూ ప్రాక్టికల్స్ పరీక్షలుంటాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు సహా ప్రాక్టికల్స్కు 100 శాతం సిలబస్ను పరిగణనలోకి తీసుకొంటారు. చాయిస్ ప్రశ్నలను 2022 మేలో నిర్వహించిన పరీక్షల్లో గణనీయంగా పెంచగా, ఈ ఏడాది కుదించారు. అంటే, కరోనాకు ముందున్న చాయిస్ ప్రశ్నలనే ఇస్తారు.
మార్చి 4,6న ఇంటర్నల్స్
ఇంటర్ విద్యార్థులకు ఇంటర్నల్స్ పరీక్షల షెడ్యూల్ను కూడా అధికారులు విడుదల చేశారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ను మార్చి 4 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ మార్చి 6 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది.
మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన వారికి, మార్కులు తక్కువగా వచ్చిన వారికి మే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫలితాలు ప్రకటించిన రోజే ఆయా పరీక్షల షెడ్యూల్ను విడుదల చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఏప్రిల్ మొదటి వారంలో ఎస్సెస్సీ పరీక్షలు
ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చిలోనే ముగియనుండగా, ఏప్రిల్ మొదటి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఎస్సెస్సీబోర్డు అధికారులు భావిస్తున్నారు. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. జీవో జారీ అయ్యాకే తుది షెడ్యూల్ ఖరారుచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.