TS Inter Exams | ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి శృతి ఓఝా తెలిపారు. పరీక్షల కోసం 1,521 సెంటర్లను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. పరీక్షలకు మొత్తం 9లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరం నుంచి 4,78,718 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 4,44,189 మంది, సెకండియర్ ప్రైవేట్లో 58,071 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షల కోసం 1,521 చీఫ్ సూపరింటెండెంట్, 27,900 ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
పరీక్షల సందర్భంగా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థను కోరినట్లు తెలిపారు. పరీక్షలా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఎలాంటి అదనపు పేపర్స్కు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంచినీటి సదుపాయంతో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పరీక్షకు ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులంతా తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని సూచించారు. ఇప్పటికే tsbie.cgg.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే చర్యలుంటాయన్నారు.