హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతం చలి తీవ్రత పెరిగింది. తూర్పు ఈశాన్య గాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. గురువారం ఉష్ణోగ్రతలు 8.9 డిగ్రీలకు పడిపోగా.. జోగులాంబ గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగానే నదమోదయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి ఉత్తరాది నుంచి చలిగాలులు ఇంకా తీవ్రంగా వీచే అవకాశం ఉందని, దీంతో ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 4 నుంచి 10 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ప్రస్తుతం తూర్పు ఈశాన్యగాలులు వీస్తున్నాయని, శుక్రవారం రాత్రి నుంచే ఉత్తరాది నుంచి చలిగాలులు ఇంకా బలంగా వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. చలిగాలులు ఫిబ్రవరి మొదటి వారం వరకు వీస్తాయన్నారు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు.
ఉత్తర గాలులు ఇప్పటికే ఉత్తర భారత దేశంలో బలంగా వీస్తున్నాయని, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, చండీగడ్, సౌరాష్ట్ర, ఢిల్లీ, నార్త్ రాజస్థాన్లలో భారీగా వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం రాష్ట్రంలో అత్యంత తక్కువగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 8.9 డిగ్రీల సెలిస్ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. అలాగే పగటి ఉష్ణోగ్రతలు కూడ చలిగాలుల ప్రభావంతో చాలా తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు వనపర్తి జిల్లా కొనాయిపల్లిలో 33.9 డిగ్రీలుగా నమోదైనట్లు టీఎస్డీపీఎస్ వివరించింది.