తిరువనంతపురం : కేరళలో వివాహాల రిజిస్ట్రేషన్లు డిజిటల్ బాట పడుతున్నాయి. నవ దంపతులు స్థానిక సంస్థల కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా, ఆన్లైన్లోనే వివాహ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వధూవరులు ఆధార్ ఆధారిత ఓటీపీ లేదా ఈ-మెయిల్ ఆథెంటికేషన్ ద్వారా తమ గుర్తింపు తనిఖీలను పూర్తి చేసుకోవచ్చు. తనిఖీ పూర్తయిన తర్వాత వెంటనే డిజిటల్లీ డౌన్లోడబుల్ సర్టిఫికేట్లు వస్తాయి.
ఈ ధోరణి కేరళలో ఊపందుకుంటున్నది. 2024 జనవరి నుంచి 2025 సెప్టెంబరు మధ్య కాలంలో 1,44,416 వివాహాలు నమోదు కాగా, వీటిలో 62,524 వివాహాల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోనే జరిగింది. తాజాగా లావణ్య, విష్ణు దంపతులు వీడియో కేవైసీ ద్వారా కవస్సెరీలోని పంచాయతీ కార్యాలయంలో తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు.
వీరు ఆన్లైన్లోనే తమ వివాహ రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకున్నారు. దంపతుల ఫొటోలతో వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అదే రోజు వచ్చింది. వీరిద్దరూ నవ్వుతూ, ఆన్లైన్లో తమ కేవైసీ వివరాలను వెరిఫై చేయించుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. కేరళ ఓ ఉదాహరణగా నిలిచిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దంపతులను ప్రశంసిస్తున్నారు.