మేడ్చల్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు భూకబ్జాలకు పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదులపై రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మండలం శంశిగూడ ఎల్లమ్మబండకు చెందిన రెండొందల మంది దళితులు సోమవారం ఆర్డీవో మల్లయ్యను కలిసి ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఆర్టీవో మల్లయ్య, కూకట్పల్లి మండల తాసిల్దార్ గోవర్ధన్ విచారణ చేపట్టారు. దళితులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను మంగళవారం పరిశీలించనున్నారు. పట్టాల పరిశీలన అనంతరం భూ కబ్జాదారులపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. శంశిగూడలోని సర్వే నంబర్ 57లో 20 ఏండ్ల క్రితం సుమారు రెండొందల మందికి అప్పటి ప్రభుత్వం ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చింది. అయితే తమను ఆయా స్థలాల వద్దకు రానీయకుండా అడ్డుకుంటూ ఈటల రాజేందర్ అనుచరులు వాటిని కబ్జా చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఆర్డీవో కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో ఆర్డీవో తక్షణ చర్యలు చేపట్టారు. మంగళవారం కూకట్పల్లి మండల తాసిల్దార్ కార్యాలయానికి ఇండ్ల స్థలాల పట్టాలు తీసుకునిరావాలని సూచించారు.
విచారణ ప్రారంభించాం
భూకబ్జాలకు సంబంధించి బాధితుల నుంచి స్వీకరించిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించాం. బాధితుల వద్ద ఉన్న ఇండ్ల స్థలాల పట్టాలను పరిశీలిస్తాం. పరిశీలన అనంతరం తదుపరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పట్టాలు లేని వారు కబ్జాలో ఉంటే కేసులు నమోదు చేస్తాం. రెండు మూడు రోజుల్లో రికార్డుల పరిశీలన పూర్తి చేసి విచారణ పూర్తి చేస్తాం. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తాం.
-ఆర్డీవో మల్లయ్య