హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు ఉత్పత్తి, ఇతర అవసరాలకు అనుమతులు లేకుండా నీటిని వాడేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మైశ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కృష్ణా పరీవాహక ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ చెప్పగా, ఇదే అంశంపై విముఖత వ్యక్తంచేస్తూ తెలంగాణ అఫిడవిట్ దాఖలు చేసింది. రెండు ప్రభుత్వాల అభిప్రాయాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల న్యాయవాదులు కోరారు. ఈ విషయంలో కేంద్రం నుంచి సూచనలు, ఆదేశాలు తీసుకోవాల్సి ఉన్నదని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటియా కోర్టుకు వివరించారు. తదుపరి విచారణను ఆగస్టు 20కి ధర్మాసనం వాయిదా వేసింది. ఆ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
మేడిగడ్డ ఇసుక టెండర్లు ఖరారు
హైదరాబాద్, జూలై 9(నమస్తే తెలంగాణ): మేడిగడ్డ ప్రాజక్టు వద్ద మేటవేసిన ఇసుకను తొలగించేందుకు మంగళవారం తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ టెండర్లు ఖరారు చేసింది. 92లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను 14 బ్లాకులుగా విభజించి టెండర్లు ఆహ్వానించగా 400 ఏజెన్సీలు దాఖలు చేశాయి. వాటిలో లాటరీ పద్ధతిలో ఎంపికచేసి కాంట్రాక్టులు ఖరారు చేశారు. త్వరలోనే అన్నారం, సుందిళ్ల బరాజ్ల వద్ద ఇసుక తవ్వకాలు చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. బరాజ్ల వద్ద ఇసుక తవ్వకాల ద్వారా రూ. 1000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. రాష్ట్రం లో 100కు పైగా ఇసుక రీచ్లు ఉన్నప్పటికీ ఎన్జీటీ కేసులు, ఇతరత్రా కారణాలతో ప్రస్తుతం 33 రీచ్ల నుంచి ఇసుకను తవ్వి సరఫరా చేస్తున్నారు. 60 లక్షల టన్నుల వరకు ఇసుక స్టాక్యార్డ్లో సిద్ధంగా ఉన్నందున వర్షాకాలంలో ఇసుక కొరత ఉండదని అధికారులు భరోసా వ్యక్తం చేస్తున్నారు.