హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): శరీరంలోని వ్యాధి కణాలను నిర్వీర్యం చేసే బయోలాజికల్ నానోపార్టికల్స్ ను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిశోధకులు అభివృద్ధి చేశారు. క్యా న్సర్ లాంటి మహమ్మారి రోగాలతో వృద్ధి చెం దే కణాలను నేరుగా నిర్వీర్యం చేసేందుకు ఈ నానోపార్టికల్స్ దోహదం చేస్తాయి. ప్రస్తుతం క్యాన్సర్ రోగులకు కీమో థెరపీలో భాగంగా బయోలాజికల్ కాంపొనెంట్స్, మందులను వేర్వేరుగా ఇస్తున్నారు. ఇవి నేరుగా క్యాన్సర్ కణాలపై పనిచేస్తాయని కచ్చితంగా చెప్పేందుకు వీల్లేదు. పైపెచ్చు వీటి వల్ల ఒక్కోసారి క్యాన్సర్ కణాల చుట్టూ ఉండే కణజాలానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించేందుకు హెచ్సీయూ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ ఆనంద్ కొండపి నేతృత్వంలోని పరిశోధన బృందం నానోపార్టికల్స్ను రూపొందించారు. వీటితోపాటు డీఎన్ఏ, ఎస్ఐఆర్ఎన్ఏ, యాంటీబాడీలు కలిసిన బయోలాజికల్ ఎలోన్, డ్రగ్ను కలిపి ఇవ్వడం ద్వారా నేరుగా క్యాన్సర్ కణాలను నాశనం చేయవచ్చని తెలిపారు. ఆవు పాలలో ఉండే సహజసిద్ధమైన లాక్టోఫెరిన్ అనే ప్రొటీన్ పదార్థం ఇక్కడ వాహకంగా పనిచేసి నానోపార్టికల్స్ను క్యాన్సర్ కణాల వద్దకు చేరవేస్తుందని వివరించారు. ఈ టెక్నాలజీకి పేటెంట్ హక్కులు లభించాయని, ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఈ చికిత్సా విధానం అందుబాటులోకి వస్తే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడినవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.