Telangana | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలమూరు తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. 35 లక్షల ఎకరాలకుపైగా సాగు యోగ్యమైన భూములున్న జిల్లా. ఒక పక్క కృష్ణమ్మ.. మరో పక్క తుంగభద్ర.. ఇంకోపక్క భీమా.. దుందుబి.. చెప్పుకుంటూ ఎన్నో అపారమైన నీటి వనరులు. కోనసీమగా విలసిల్లాల్సిన పాలమూరు కరువుకు ఆలవాలమైంది. దేశవ్యాప్తంగా అత్యంత వెనకబడిన జిల్లాలుగా 9 గుర్తిస్తే అందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఒకటిగా నిలిచింది. 40 లక్షల జనాభాలో సగానికిపైగా పొట్ట చేతపట్టుకుని వలసపోయేవారు. అందుకు కారణం ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణను విలీనం చేయటమే. విలీనంతో తెలంగాణ న్యాయమైన నీటి వాటా కోసం డిమాండ్ చేసే హక్కును కోల్పోయింది. బచావత్, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునళ్ల ముందు వాదనలను వినిపించే అవకాశం చేజారిపోయింది. స్వరాష్ట్రంతోనే న్యాయమైన నీటి వాటా దక్కుతుందని నాటి ఉద్యమనేత, నేటి సీఎం కేసీఆర్ నినదించారు. పదేండ్లుగా అలుపెరగని పోరాటం చేసి, ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేలా కేంద్రం మెడలు వంచారు.
ఖోస్లా కమిటీ సూచనల ప్రకారం నదీ జలాలపై మొదటి హక్కు యాజమాన్య బేసిన్ రాష్ర్టాలకే ఉంటుంది. బేసిన్ అవసరాలు తీరిన తరువాతనే ఇతర ప్రాంతాలకు మళ్లించాలి. 1966 హెల్సింకీ రూల్స్, ప్రస్తుతం అమలులో ఉన్న యునైటెడ్ నేషన్స్ వాటర్ కోర్ కన్వెన్షన్ (1997)లు ప్రకారం బేసిన్లోని రాష్ర్టాలకు సమన్యాయం, సహేతుకత అంటే పరీవాహక ప్రాంతం, సాగుకు యోగ్యమైన భూములు, కరువు పీడిత గ్రామాలు ఇలా పలు అంశాల ఆధారంగా నదీ జలాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి ఏపీ పాలకులు ఈ సహజ న్యాయ సూత్రాలన్నింటినీ తుంగలో తొక్కారు.
రెండు ట్రిబ్యునళ్ల ఎదుట సీమాంధ్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టే ప్రాజెక్టులకే నీటి కేటాయింపులు చేసేలా వాదనలు వినిపించారు. అందుకు ఆర్డీఎస్, కేసీ కెనాల్స్కు చేసిన నీటి కేటాయింపులే ఉదాహరణ. 1970లో బచావత్ ట్రిబ్యునల్ ముందు ఆర్డీఎస్ కాలువకు, కేసీ కెనాల్కు సమానంగా నీటిని కేటాయించాలని వాదించాల్సిన నాటి ప్రభుత్వం, కేసీ కెనాల్కు 69.4 టీఎంసీలు, ఆర్డీఎస్ కెనాల్కు 15.9 టీఎంసీలు డిమాండ్ చేసింది. 1944 ఒప్పందం ప్రకారం కేటాయించాల్సిన అవసరం లేదని మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం చేసింది. ఉమ్మడి ఏపీ వాదనలతో ట్రిబ్యునల్ కెసీ కెనాల్కు 39.9 టీఎంసీలు, మహబూబ్నగర్ జిల్లాకు 15.9 టీఎంసీలు మాత్రమే కేటాయించింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట అసలు కేసీ కెనాల్ ఊసే ఎత్తకుండా ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కుడి వైపునకు కొత్త కెనాల్ కోసం 4 టీఎంసీలు కేటాయించాలని కోరింది. ఆర్డీఎస్ గురించి వాదనలు వినిపించలేదు.
స్వరాష్ట్ర ఏర్పాటుతో, సీఎం కేసీఆర్ అలుపెరగని పోరాటంతో తెలంగాణ నేడు న్యాయమైన నీటి వాటాల కోసం ట్రిబ్యునళ్ల ఎదుట వాదనలను వినిపించే అవకాశాన్ని 70 ఏండ్ల అనంతరం తిరిగి దక్కించుకొన్నది. పరీవాహక ప్రాంతం, కరువు పీడిత ప్రాంతాలు, జనాభా.. ఇలా ఏ విధంగా చూసుకున్నా తెలంగాణకు కృష్ణా జలాల్లో 70 శాతం వాటా దక్కాల్సి ఉన్నది. అందుకోసం నేడు బలమైన వాదనలు వినిపించే అవకాశం ఏర్పడింది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు నికర జలాలకు కేటాయించాలని డిమాండ్ చేసే వెసులుబాటు తెలంగాణకు దక్కింది.
అంతరాష్ట్ర జల వివాదాల చట్టం 1956 ప్రకారం నదీ జలాల్లో నీటి వాటా కోసం రాష్ట్రం మాత్రమే వాదనలు వినిపించాల్సి ఉంటుంది. బేసిన్లోని ప్రాంతాలకు తమ వాదనలను వినిపించే హక్కులేదు. ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను ఒక రాష్ట్రం తమ బేసిన్లోని ప్రాంతాలకు ప్రాధాన్యతపరంగా సమంగా పంచుకోవాల్సి ఉంటుంది. ఇదే తెలంగాణకు శాపంగా మారింది. 1956లో ఏపీతో విలీనంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీకి మొదటిసారి కేంద్రం 1969లో బచావత్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం 2004లో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్-2ను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాకపోవడంతో ఆ రెండు ట్రిబ్యునళ్ల ఎదుట వాదనలు వినిపించే అవకాశం, హక్కు తెలంగాణకు లేకుండా పోయాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు హైదరాబాద్ స్టేట్ 1935 నుంచే అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. అవన్నీ ఉమ్మడి పాలకులు అటకెక్కించారు.