Karimnagar | నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ, ఆడపిల్లను కడుపులోనే చిదిమేసిన ఘటన తాజాగా బయటపడింది. సీహెచ్ఎఫ్డబ్ల్యూ ఆదేశాల మేరకు సోమవారం డీఎంహెచ్వో లలితాదేవి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేయగా, జమ్మికుంటలోని శ్రీ విజయసాయి ప్రైవేట్ దవాఖాన బాగోతం బహిర్గతమైంది. మొదట కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా కూపీలాగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఒప్పుకోవడం, 7 వేలు తీసుకొని నిర్ధారణ చేయడం, ఆడపిల్ల అని గుర్తించడం, 30 వేలు తీసుకొని అబార్షన్ చేసినట్టు విచారణలో తేలడంతో దవాఖానకు షోకాజ్ నోటీసులిచ్చారు. అనుమతుల్లేని అల్ట్రా స్కానింగ్ మిషన్, రూం సీజ్ చేయడంతోపాటు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకురాలు ప్రభుత్వ వైద్యురాలు కావడంతో సస్పెన్షన్కు సిఫారసు చేయగా, ఈ ఘటన అడ్డదారులు తొక్కుతున్న ప్రైవేట్ దవాఖాన నిర్వాహకుల్లో వణుకు పుట్టించింది.
జమ్మికుంట, మే 15 : జమ్మికుంటలోని పలు ప్రైవేట్ దవాఖానాల్లో లింగ నిర్ధారణ, అబార్షన్లు చేస్తున్నారని, ప్రధానంగా స్థానిక శ్రీవిజయసాయి దవాఖానలో ఇష్టానుసారంగా జరుగుతున్నాయని ఫిర్యాదులున్నాయి. గతం లో పలుసార్లు తనిఖీలు కూడా జరిగాయి. తాజాగా, రాష్ట్ర కమిషనర్ ఆఫ్హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (సీహెచ్ఎఫ్డబ్ల్యూ) ఆదేశాల మేరకు సోమవారం కరీంనగర్ డీఎంహెచ్వో లలితాదేవి ఆధ్వర్యంలో అడిషనల్ డీఎంహెచ్వో, డిప్యూటీ డీఎంహెచ్వోలతో కూడిన మూడు బృందాలు రంగంలోకి దిగాయి. ఏకకాలంలో జమ్మికుంటలోని శ్రీవిజయసాయి, సప్తగిరి, మమత దవాఖానల్లో ఆకస్మిక తనిఖీలు చేశాయి. విజయసాయిలో సాయంత్రం ఆరు గంగల వరకు తనిఖీలు చేయగా, సప్తగిరి, మమత దవాఖానల్లో రాత్రి 7 గంటల వరకు కొనసాగాయి. ఇదిలా ఉండగా.. డీఎంహెచ్వో లలితాదేవి శ్రీ విజయసాయి దవాఖానలో రికార్డులను పరిశీలించారు. వందశాతం సిజేరియన్లు జరిగినట్లు తేల్చారు. అంతేకాకుండా, మానకొండూర్ మండలం వన్నారం గ్రామానికి చెందిన జంగిలి రజితకు లింగ నిర్ధారణతోపాటు అబార్షన్ చేసినట్లు గుర్తించారు.
డీఎంహెచ్వో ఆయా దవాఖానల్లోని పలువురు పేషెంట్లతో మాట్లాడారు. రజిత అనే మహిళ ‘ఏం జరిగిందమ్మా..? మీ ఊరెక్క డా..? ఇక్కడెందుకు జాయిన్ అయ్యారు?’ అని ప్రశ్నించారు. దాంతో ఆ మహిళ ‘మాది మానకొండూర్ మండలం వన్నారం గ్రామం’ అని చెప్పింది. వాంతులు, మోషన్స్ కావడంతో వచ్చానని తడబడుతూ చెప్పడంతో డీఎంహెచ్వోకు అనుమానం వచ్చి, కేస్ షీట్ను పరిశీలించారు. స్వతహాగా ఆమె గైనిక్ డాక్టర్ కావడంతో సదరు మహిళకు అబార్షన్ జరిగిందని గుర్తించారు. కన్ఫర్మేషన్ కోసం వన్నారం పరిధిలోని గట్టుదుద్దెనపల్లి సబ్ సెంటర్, మానకొండూర్ పీహెచ్సీకి ఫోన్ చేశారు. సదరు మహిళ గర్భిణి కాగా, కేసీఆర్ కిట్ కోసం పోర్టల్లో పేరు నమో దు చేసుకున్నట్టు పీహెచ్సీలో గుర్తించారు. 8 వారం(5 నెల)తో ఉందని తేల్చారు. పీహెచ్సీ సిబ్బంది ఇచ్చిన వివరాలను సదరు యువతి రజితకు డీఎంహెచ్వో చెప్పారు.
రజితకు ఇప్పటికే మూడేళ్ల కూతురున్నది. రెండోసారి గర్భం దాల్చింది. ఐదు నెలల గర్భిణి. మానకొండూర్ పీహెచ్సీలో సీఎం కేసీఆర్ కిట్ కోసం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్నది. అయితే, రజితను కుటుంబసభ్యులు లింగ నిర్ధారణ కోసం గత శుక్రవారం జమ్మికుంటలోని శ్రీవిజయసాయి దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ లావణ్య 7 వేలు తీసుకుని రజితకు అల్ట్రా స్కానింగ్ చేసింది. ఆడపిల్లగా గుర్తించింది. దీంతో కుటుంబసభ్యులు అబార్షన్ చేయాలని కోరారు. దీంతో డాక్టర్ లావణ్య అబార్షన్ కోసం 30వేలు తీసుకుని, శుక్రవారం నుంచి రజితకు మెడిసిన్ ఇచ్చింది. సోమవారం ఉదయం అబార్షన్ చేసింది. బాధితురాలు రజిత ఈ విషయాన్ని డీఎంహెచ్వో లలితాదేవి, తహసీల్దార్ బండి రాజేశ్వరి, సీఐ రమేశ్, అధికారుల ముందు ఒప్పుకొని స్టేట్మెంట్ ఇచ్చింది.
నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ, అబార్షన్ చేసిన విషయాన్ని డీఎంహెచ్వో గుర్తించి, కలెక్టర్, తహసీల్దార్, సీఐ, ఆర్డీవోతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్, ఏఎస్ఐ రాధాకృష్ణ సమక్షంలో దవాఖానలోని అధునాతన అల్ట్రా స్కానింగ్ మిషన్, రూంను సీజ్ చేశారు. తహసీల్దార్ జరిగిన తతంగమంతా పంచనామా చేశారు. కేసు నమోదుకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తున్న లావణ్య ప్రైవేట్ దవాఖానలో లింగనిర్ధారణ, అబార్షన్లు చేస్తున్నదని, ఆమెను సస్పెండ్ చేయాలని, విజయసాయి దవాఖాన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని జిల్లా అధికారులకు డీఎంహెచ్వో సిఫారసు చేశారు. అలాగే, దవాఖానలో కొందరు పేషెంట్లు ఉన్నందున, ప్రస్తుతం సీజ్ చేయడం లేదని చెప్పారు. వారికి ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత దవాఖాన నడిపించకూడదని ఆదేశించారు. షోకాజ్ నోటీ జారీ చేశారు. ఆమె వెంట పలువురు వైద్యాధికారులు, పోలీసులు, తదితరులున్నారు.