హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): పథకాలు ప్రజల వద్దకు చేరడంలో సమాచార, పౌర సంబంధాలశాఖది కీలకపాత్ర అని రాష్ట్ర ఎన్నికల అధికారి సీ పార్థసారథి తెలిపారు. ప్రజలు, ప్రభుత్వానికి సమాచార శాఖ వారధి అని పేర్కొన్నారు. ఆదివారం ఖైరతాబాద్లో పంచాయతీరాజ్శాఖ ఆడిటోరియంలో సమాచార, పౌర సంబంధాలశాఖ ఉమ్మడి రాష్ట్ర అధికారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బందిని సత్కరించారు.
ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఎన్నో శాఖలు ఉన్నప్పటికీ సమాచార శాఖది ప్రత్యేక స్థానమని, ప్రతిశాఖను సమన్వయం చేసే గొప్ప అవకాశం ఉన్నదని చెప్పారు. సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ బీ రాజమౌళి మాట్లాడుతూ.. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అనుభవాలతో మార్గదర్శనం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రముఖ మనస్తత్వ విశ్లేషకులు బీవీ పట్టాభిరామ్, సమాచార శాఖ రిటైర్డ్ డైరెక్టర్లు ఏఎల్ కిస్మత్కుమార్, సుభాష్గౌడ్, ప్రమోద్రావు, సత్యారావు, యశోద ఆసుపత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ బాలరాజు, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, ఎఫ్డీసీ ఈడీ కిశోర్బాబు, జేడీ జగన్, ప్రెస్ అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.