రెండు హత్యలు.. కారణం ఒక్కటే. చేసింది కట్టుకొన్న భర్తలే. ఒక ఘటనలో ముగ్గురు పిల్లలు తల్లి లేనివారయ్యారు. ఇంకో ఘటనలో తల్లిదండ్రులకు బిడ్డ లేకుండా పోయింది. అనుమానంతో భార్యలను చంపిన రెండు వేర్వేరు ఘటనలు హైదరాబాద్లో చోటుచేసుకొన్నాయి.
బండ్లగూడ, డిసెంబర్ 10: అత్తాపూర్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాద్నగర్ ఎంఎం పహాడ్లో నివాసం ఉండే పర్వేజ్, సమ్రీన్ బేగంకు 14 ఏండ్ల క్రితం పెండ్లి అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు. పర్వేజ్ పెయింటర్. సమ్రీన్పై అతనికి అనుమానం. గతంలో చాలాసార్లు ఆమెపై దాడిచేశాడు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. రాజీ కుదిరి ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఈ మధ్య మళ్లీ అనుమానం పెంచుకొన్న పర్వేజ్ గురువారం అర్ధరాత్రి ఆమెతో గొడవపడ్డారు. 3 గంటల సమయంలో సమ్రిన్ను చంపి మొండెం, తలను వేరు చేశాడు. తలను బ్యాగులో పెట్టుకొని పిల్లలతో కలిసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఒడిశాకు చెందిన భాస్కర్రావు కుటంబం 25 ఏండ్ల కిందట హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్థిరపడ్డారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కన్నయ్య కుటుంబం కూడా నగరంలో స్థిరపడింది. భాస్కర్రావు చిన్న కూతురు శిరీష(21)ను కన్నయ్య చిన్న కొడుకు సంతోష్(30)కు ఇచ్చి మే 30న పెండ్లి చేశారు. కట్నం కింద రూ.4 లక్షలు, 3 తులాల బంగారం, ఇతర కానుకలు ఇచ్చారు. వారిద్దరు మూసాపేటలో కాపురం పెట్టారు. పెండ్లి అయిన కొన్నిరోజులకే శిరీషపై అనుమానం పెంచుకొన్న సంతోష్.. వేధింపులకు గురిచేశాడు. రెండుసార్లు పంచాయితీ కూడా జరిగింది. అయినా సంతోష్ మారలేదు. గురువారం మధ్యాహ్నం భార్యను హత్య చేసి శవాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి పారిపోయాడు. శిరీష తల్లిదండ్రులు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావటంతో ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉన్నది. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తాళం పగులగొట్టి చూడగా అసలు విషయం తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.