హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను ఏర్పాటు చేసుకున్నవారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు కొద్ది నెలలుగా నిలిచిపోవడంతో పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సబ్సిడీ బకాయిలు చెల్లించాలని కోరుతూ హైదరాబాద్లోని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యాలయం చుట్టూ రోజూ అనేక మంది చక్కర్లు కొడుతున్నారు. వారికి ఏమి చెప్పాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రస్తుతం దాదాపు 20 వేల మంది చిన్నతరహా పారిశ్రామికవేత్తలకు రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు గత కేసీఆర్ ప్రభుత్వం టీ-ప్రైడ్, టీ-ఐడియా పథకాల కింద 35% వరకు పెట్టబడి రాయితీలు కల్పించడంతోపాటు విద్యుత్తు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర పన్నుల్లోనూ విరివిగా రాయితీలు అందించింది. దీంతో నిరుద్వోగ యువతలో చాలా మంది స్వయం ఉపాధి వైపు మళ్లారు.
ప్రభుత్వ సబ్సిడీలకు తోడుగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వివిధ రకాల స్టార్టప్లు ఏర్పాటు చేసుకున్నారు. కానీ, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి సబ్సిడీల విడుదల నిలిచిపోయింది. దీంతో చిన్నతరహా యూనిట్లు ఏర్పాటు చేసుకున్నవారు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపామని, నిధులు విడుదలైన వెంటనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు చెప్తున్నారు. కానీ, ఆ నిధులు ఎప్పటిలోగా వస్తాయో మాత్రం చెప్పలేకపోతున్నారు.
కొత్త పాలసీ పేరుతో మరింత జాప్యం
రాష్ట్రంలో కొత్త ఎంఎస్ఎంఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మూడు నెలలు దాటినా అందులో పురోగతి లేదు. కొత్త పాలసీలో మరిన్ని ఆకర్షణీయ సబ్సిడీలు ఉంటాయని మంత్రులు పదేపదే చెబుతున్నా దాన్ని ఎప్పుడు ప్రవేశపెడతారో అంతుబట్టడంలేదు. కొత్త పాలసీ వచ్చాకే పాత సబ్సిడీ బకాయిలు విడుదల కావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. కానీ, రేపోమాపో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండటంతో కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ రాకకు కనీసం మరో మూడు నెలలైనా పట్టే అవకాశం ఉన్నది.