శేరిలింగంపల్లి, డిసెంబర్ 24: భారతీయ సంప్రదాయ ప్రాచీన నృత్యం కూచిపూడి డ్యాన్స్ లెస్సన్ గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఏకకాలంలో 3,883 మంది నృత్య కళాకారులు ఆదివారం రాత్రి కూచిపూడి కళావైభవాన్ని ప్రదర్శించారు. దీనికి గచ్చిబౌలిలోని బాలయోగి అథ్లెటిక్ క్రీడాస్టేడియం వేదికైంది. భారత్ ఆర్ట్ అకాడమీ అధ్వర్యంలో కూచిపూడి కళావైభవం పేరిట అతిపెద్ద కూచిపూడి లెస్సన్ ప్రదర్శించారు.
స్టేడియంలో పలువైపులా ఏడు నిమిషాలపాటు కళాకారులు సంప్రదాయ దుస్తుల్లో ఏకకాలంలో కూచిపూడి నృత్య సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ ప్రతినిధి రిషినాథ్ సర్టిఫికెట్ను అందజేశారు. చెన్నైలో 2020 ఫిబ్రవరిలో 1,183 మంది కళాకారులతో ఉన్న కూచిపూడి డ్యాన్స్లెస్సన్ రికార్డును ఇప్పుడు బద్దలు కొట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణరావు, ధనసరి సీతక్క హాజరయ్యారు. పాఠశాల స్థాయి నుంచే భారతీయ కళలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పేర్కొన్నారు.