హైదరాబాద్ : ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్) 2019 బ్యాచ్ కు చెందిన నలుగురు అధికారుల బృందం శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించింది. సీఈవో ఆర్.శైలేష్ రెడ్డిని కలిసిన బృందం టి-సాట్ నిర్వహణ గురించి తెలుసుకొని కార్యాలయంలోని స్టూడియో, పీసీఆర్, ఎర్త్ స్టేషన్ పనితీరును బృందం సభ్యులు పరిశీలించారు.
ఐఐఎస్ 2019 బ్యాచ్ కు చెందిన ఆశీష్ గోయల్, డి.బాలనాగేంద్రన్, కె.అనురాగ్ కుమార్, శ్రీ సాయి వెంపటిబృందంలో సభ్యులుగా ఉన్నారు. టి-సాట్ కార్యాలయంలో సీఈవో శైలేష్ రెడ్డితో జరిగిన ముఖాముఖిలో బృందం సభ్యులు టి-సాట్ నిర్వహణ తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఈవో శైలేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా టి-సాట్ నెట్వర్క్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. కేవలం ఆర్వోటీ పద్ధతిలో ప్రసారాలను అందించే టి-సాట్ నెట్వర్క్ మంత్రి కేటీఆర్ చొరవతో కేబుల్, డీటీహెచ్, శాటిలైట్ విభాగాలతో పాటు డిజిటల్ మీడియాలోనూ వివిధ రంగాలకు విస్తరించిన సేవల విధానాన్ని వివరించారు.
డిజిటల్ విద్యతో పాటు, ఆరోగ్య సలహాలు, పోటీ పరీక్షల సమాచారం, వ్యవసాయ సేద్యంలోని కొత్త మెళకువలు ఆయా రంగాలకు చేరవేయడంలో టి-సాట్ పనిచేసిన పద్ధతులను తెలియ చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థ అన్ని వర్గాలకు ఎలా ఉపయోగపడుతుందో, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ టి-సాట్ నెట్వర్క్ ఎలా పనిచేసిందో ఉదాహరణలతో వివరించారు.
2014 సంవత్సరానికి ముందు కేవలం వందల సంఖ్యలో సేవలందించిన టి-సాట్ వివిధ మార్గాల ద్వార తెలంగాణలోని సుమారు 90 శాతం మంది ప్రజలకు చేరువైందని చెప్పారు. కరోనా సమయంలో డిజిటల్ పాఠ్యాంశాలు ఎంత మంది విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందని బృందం సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగాసెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన మొదటి రోజే సుమారు 14 లక్షల మందికి చేరుకుని ఆ సంఖ్య దిన దినం పెరుగుతూనే వచ్చిందన్నారు.
ప్రభుత్వాలకు సంబంధించిన సమాచారంతో ప్రజలకే ప్రయోజనం చేకూర్చే సమాచారాన్ని చేరవేయడంలో కమ్యూనికేషన్ రంగం పాత్ర కీలకమని, ఆ రంగాన్ని ఎంచుకున్న ఐఐఎస్ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. పి.ఐ.బి మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారి వి.గాయత్రి బృందాన్ని సమన్వయపరిచారు.