హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): భారత్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణాంకవేత్త కల్యంపూడి రాధాకృష్ణరావు (102) ఇక లేరు. సీఆర్ రావుగా ప్రపంచానికి చిరపరిచితులైన ఆయన అనారోగ్యంతో బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ప్రపంచంలోనే ప్రఖాత్య గణాంకవేత్తగా గుర్తింపు పొందిన రాధాకృష్ణరావు.. ఈ ఏడాది స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ను గెలుచుకున్నారు. ఆధునిక గణితశాస్త్రంలో గొప్ప ప్రావీణ్యుడి గా గుర్తింపు పొందిన రాధాకృష్ణరావు.. మల్టీవేరియంట్ విశ్లేషణ, శాంపిల్ సర్వే థియరీ, బయోమెట్రి తదితర రంగాలకు ఎనలేని సేవలు అందించారు. బిజినెస్ నుంచి మెడిసిన్ వరకు, ఆంథ్రోపాలజీ నుంచి ఎకనమిక్స్ వరకు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగలిలో 1920 సెప్టెంబర్ 10న తెలుగు కుటుంబంలో జన్మించిన సీఆర్ రావు.. 1943లో కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్కు వెళ్లి సర్ రోనాల్డ్ వద్ద గణిత శాస్త్రంలో పీహెచ్డీ చేయడంతోపాటు 1965లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో డీఎస్సీలో డిగ్రీ చేశారు. తొలుత ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్, కేంబ్రిడ్జి ఆంథ్రోపోలాజికల్ మ్యూజియంలో పనిచేసిన సీఆర్ రావు.. అనంతరం భారత్లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ను ప్రారంభించి, అనేక కీలక పదవుల్లో పనిచేశారు. 1968లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సీఆర్ రావును 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ ‘నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్’తో సత్కరించారు. స్టాటిస్టిక్స్ టెక్నిక్లను అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపై ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.