హైదరాబాద్: ఈ నెల 25న ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ 20 మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం ఆథిత్యమివ్వనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్ టికెట్లను సికింద్రాబాద్లోని జింఖానా (Gymkhana) గ్రౌండ్లో విక్రయించనున్నారు. దీంతో గురువారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో యువత జింఖానా మైదానం వద్ద టికెట్ల కోసం బారులు తీరారు. కాగా, ఒక వ్యక్తికి రెండు టికెట్లు మాత్రమే ఇస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. టికెట్లు కొనేందుకు వచ్చేవాళ్లు ఆధార్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది.
టికెట్ల విక్రయానికి సంబంధించి తీవ్ర గందరగోళం కొనసాగింది. మ్యాచ్ తేదీ సమీపిస్తున్నప్పటికీ ఆన్లైన్, ఆఫ్లైన్ అంటూ హెచ్సీఏ సాగదీసింది. అయితే హెచ్సీఏ తీరుపై అభిమానులు నిరసన వ్యక్తంచేయడంతో అధికారులు దిగివచ్చారు. నేటి నుంచి జింఖానా గ్రౌండ్లో ఉదయం 10 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించారు.
కాగా, టికెట్లను బ్లాక్లో విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిలో ఏర్పాటైన హెచ్సీఏ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ అభిమానులకు టిక్కెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.