అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు మరోచోట.. హంస తూలికలు ఒకచోట..
అలసిన దేహాలొకచోట… ప్రజాకవి కాళోజీ అన్న ఈ మాటలు.. మోదీ ఏలుబడిలో ప్రస్తుతం దేశం అనుభవిస్తున్న దురావస్థకు సజీవ సాక్ష్యాలు. మోదీ పాలనలో ఆయన ఆప్తమిత్రలు అదానీ, అంబానీలు ఒకవైపు అత్యంత శ్రీమంతులుగా చలామణి అవుతుండగా.. పేదోడికి పట్టెడు అన్నం కూడా దొరక్క ఆకలి కేకలు పెట్టే దుస్థితికి దేశం చేరింది.
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఆకలి సూచీలో (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్ఐ) భారత్ దారుణమైన స్థితికి పడిపోయింది. వివిధ దేశాల్లో ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను సూచించే ఈ సూచీలో 2023 సంవత్సరానికి గానూ మొత్తం 125 దేశాలను పరిగణనలోకి తీసుకొంటే 28.7 హంగర్ స్కోరుతో భారత్ 111వ స్థానంలో నిలిచింది. కిందటేడాది ర్యాంకుతో పోలిస్తే నాలుగు స్థానాలను కోల్పోయింది.
గత కొంతకాలంగా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న పొరుగు దేశం శ్రీలంక, ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పేద దేశాలుగా పిలిచే సూడాన్, రువాండా, నైజీరియా, ఇథియోపియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు యుద్ధంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ (44)తో పోలిస్తే భారత్ దారుణమైన ర్యాంకుకు పడిపోవడం గమనార్హం. ఈ మేరకు జీహెచ్ఐ వార్షిక నివేదికలో వెల్లడైంది. భారత్లో ఆకలి స్థాయి చాలా తీవ్రంగా ఉన్నదని నివేదిక హెచ్చరించింది. సూచీలో చైనా, కువైట్, యూఏఈ సహా 20 దేశాలు 5 కంటే తక్కువ స్కోర్తో అగ్రస్థానంలో నిలిచినట్టు నివేదిక వెల్లడించింది.
ధరల నియంత్రణ, ఆహార భద్రత విషయంలో మోదీ సర్కారుకు ఎంతమాత్రం ప్రణాళిక లేదు. తెలంగాణవంటి రాష్ర్టాల్లో రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ధాన్యాన్ని కేంద్రం కొనలేదు. దేశంలో ఒకవైపు ఆకలి కేకలు వినిపిస్తున్నప్పటికీ పట్టించుకోలేదు. ధాన్యం నిల్వల్ని ఎందుకు కొనరు? అని ప్రశ్నిస్తే గోదాముల్లో సరిపడా నిల్వలున్నాయని బదులిచ్చిన కేంద్రం.. తీరా గోధుమలు, బియ్యం, ఉల్లి.. ఇలా అన్నింటి ఎగుమతులపైనా నిషేధం విధించింది.
నిల్వలు సరిపడా ఉన్నప్పుడు నిషేధం ఎందుకో సమాధానం మాత్రం ఇవ్వలేదు. ఇక, స్వతంత్ర భారతావని చరిత్రలో తొలిసారిగా టమాటాలను నేపాల్ నుంచి దిగుమతి చేసుకొని ఇటీవలే మోదీ సర్కారు రికార్డులకెక్కింది. గోధుమలను రష్యా నుంచి, కందిపప్పును మొజాంబిక్, మయన్మార్ నుంచి, వంటనూనెను ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకొనే దుస్థితికి భారత్ చేరుకుంది.
ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆకలి స్థాయిలు, పిల్లల్లో పోషకాహారలోపం, శిశుమరణాలు తదితర గణాంకాలు ఆధారంగా చేసుకొని జీహెచ్ఐ వార్షిక నివేదికను ఐర్లాండ్కు చెందిన కన్సర్న్ వరల్డ్వైడ్, జర్మనీకి చెందిన వెల్త్ హంగర్ లైఫ్ సంస్థలు ఏటా సంయుక్తంగా వెలువరిస్తాయి. ఎక్కువ స్కోర్, ర్యాంకు సాధించిన దేశంలో ఆకలి సంక్షోభం తీవ్ర రూపంలో ఉన్నట్టు పరిగణించాలి.
జీహెచ్ఐ ర్యాంకింగ్స్లో భారత్ కంటే పొరుగు దేశాలు మంచి ప్రదర్శనను చూపించడమే కాదు.. కిందటేడాదితో పోలిస్తే ర్యాంకులను మెరుగుపర్చుకున్నాయి కూడా. కిందటేడాది 64వ ర్యాంకు సాధించిన శ్రీలంక ఇప్పుడు 60వ ర్యాంకును, గత ఏడాది 81వ ర్యాంకులో ఉండే నేపాల్ ప్రస్తుతం 69 స్థానాన్ని , నిరుడు 84వ ర్యాంకులో ఉండే బంగ్లాదేశ్ ఇప్పుడు 81వ ర్యాంకును సాధించగా.. భారత్ మాత్రం నాలుగు స్థానాలను కోల్పోయి 107వ ర్యాంకు నుంచి 111వ స్థానానికి పడిపోవడం గమనార్హం. అయితే జీహెచ్ఐ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకలి స్థాయుల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉన్నదంటూ మండిపడింది.