BRS Pleanry | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ భారత్ రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ సమావేశమైంది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ప్రసంగంతో మొదలైంది. అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో ‘దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం’ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తీర్మానం ప్రవేశపెడుతూ.. ‘దేశంలో నీటి వనరుల లభ్యత దేశ ప్రజల అవసరాలకు మించిన స్థాయిలో ఉంది. ఏటా దాదాపు 4వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం కురుస్తున్నది. 1.40వేల టీఎంసీల వర్షపాతం సంభవిస్తున్నది. ఇందులో ఆవిరైపోయిన, గడ్డ కట్టుకుపోయిన, ఇంకిపోయిన సగం నీటిని తీసేస్తే నికరంగా 70వేల టీఎంసీల నీరు నదుల్లో ప్రవహిస్తున్నది. విషాదమేమిటంటే.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశవ్యాప్తంగా కేవలం 20 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకున్నాం. వినియోగ యోగ్యమైన మిగతా 50వేల టీఎంసీల జలాలు వృథాగా ఉప్పు సముద్రం పాలవుతున్నాయి. ఇందులోనుంచి మరో 20వేల టీఎంసీల నీటిని వినియోగించుకుంటే దేశంలో సాగు యోగ్యమైన 41 కోట్ల ఎకరాల్లో ప్రతి ఎకరానికీ సాగునీరందించవచ్చు. ఈ లెక్కలు ఎవరి కల్పితాలు కావు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం వెలువరించిన గణాంకాలు’ అన్నారు.
‘50వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంటే.. ఏమీ పట్టనట్టు దేశ పాలకులు తమాషా చూస్తున్నారు. దేశంలో ఎక్కడచూసినా తాగునీటికి, సాగునీటికి కటకటనే. 75 సంవత్సరాల చరిత్ర చూస్తే స్వాతంత్ర్యం లభించిన తొలినాళ్లలో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నకాలంలో దేశ నిర్మాణం కోసం బలమైన అడుగులు పడ్డాయి. దేశవ్యాప్తంగా సాగునీటి అవసరాల కోసం భాక్రానంగల్, నాగార్జునసాగర్ తదితర భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. కానీ, తదనంతరం దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు పూర్తిగా నిష్ర్కియా పరత్వంతో వ్యవహరించాయి. నిర్ణీత కాల వ్యవధితో కూడిన, ఆచరణ యోగ్యమైన సమగ్ర సాగునీటి విధానం రూపొందించి, అమలు చేయకపోవడంతో దేశ ప్రజలు అనవసరంగా, అకారణంగా అష్టకష్టాలు అనుభవిస్తూ శాపగ్రస్త జీవితాలు గడుపుతున్నారు.
ఇప్పటికీ దేశానికి తగిన సాగునీటి విధానం రూపొందకపోవడం ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యగా చెప్పుకోవాలి. ప్రకృతి వరప్రసాదంగా అనేక జీవ నదులు పారుతున్న భారతదేశంలో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నారు. పచ్చని పంటలు పండాల్సిన పొలాలు నెర్రెలుబారి నిర్జీవమైపోతున్నాయి. దిక్కుతోచని రైతన్నలు సాగునీటి కోసం తమ శ్రమఫలాన్నంతా ధారపోస్తున్నారు. బోర్ల మీద బోర్లు వేసినా ఫలితంలేక నిరాశా, నిస్పృహలతో నీరసించిపోతున్నారు. అంతకంతకూ అప్పుల భారం పెరిగిపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పాపానికి కారకులు ఇంకెవరో కాదు, ఖచ్చితంగా ఈ దేశ పాలకులే. పాలకుల అవగాహనా రాహిత్యానికి ఎన్నో నిదర్శనాలున్నాయి’ పేర్కొన్నారు.
‘భారతదేశంకన్నా విస్తీర్ణంలోనూ జనాభాలోనూ చాలా చిన్నవైన దేశాలు పెద్ద పెద్ద రిజర్వాయర్లు నిర్మించుకున్నాయి. మన దేశం కంటే చాలా చిన్న దేశమైనా జింబాబ్వేలో ప్రపంచంలోనే అతిపెద్ద దైన రిజర్వాయర్ ఉంది. జాంబేజీ నదిపై నిర్మించిన కరీబా డ్యామ్ సామర్థ్యం 6,533 టీఎంసీలు. అదే విధంగా రష్యాలోని అంగారా నదిపై 5,968 టీఎంసీలతో బ్రాట్స్క్ డ్యామ్ ఉంది. ఆఫ్రికా ఖండంలోని ఘనా అనే దేశంలో ఓల్టా నదిపై 5,085 టీఎంసీల సామర్థ్యం కలిగిన అకొసోంబో రిజర్వాయర్ కెనడాలో మనీకూగాన్ నదిపై 4,944 టీఎంసీలతో జాన్సన్ డ్యామ్, వెనిజులా దేశంలో కరోనీ నదిపై 4,767 టీఎంసీలతో గురి డ్యామ్ ఉంది. ఈజిప్టులో నైలు నదిపై 4,661 టీఎంసీలతో అస్వన్ హై డ్యామ్, కెనడా దేశంలో బ్రిటిష్ కొలంబియాలో పీస్ నదిపై 2,613 టీఎంసీలతో బెన్నెట్ డ్యామ్ ఉన్నది.
రష్యా దేశంలో యెనిసే నదిపై 2,588 టీఎంసీలతో క్రాస్నో యార్స్క్ డ్యామ్, రష్యా దేశంలో జేయా నదిపై 2,401 టీఎంసీలతో జేయా డ్యామ్, కెనడా దేశంలోని లా గ్రాండే నదిపై 2179 టీఎంసీలతో రాబర్ట్ బౌరాసా డ్యామ్, చైనా దేశంలో యాంగ్సీ నదిపై 1400 టీఎంసీల త్రీగార్జెస్ డ్యామ్, అమెరికా కొలరాడో నదిపై 1243 టీఎంసీలతో హూవర్ డ్యామ్, బ్రెజిల్లో పరానా నదిపై 1024 టీఎంసీలతో ఇతైపూ రిజర్వాయర్ ఉన్నది. ఇలాంటి భారీ రిజర్వాయర్లు దేశానికి కనీసం రెండుమూడైనా ఉండాలి. లేవంటే పాలకులు ఎంత అవగాహనా రాహిత్యంతో ఉన్నరో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి రిజర్వాయర్ల నిర్మాణం వల్ల సాగునీటి అవసరాలు తీరిపోవడమేగాకుండా, అతివృష్టి, అనావృష్టి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అటు వరదల ముప్పును, ఇటు కరువు కాటకాలను రెండింటినీ నివారించే అవకాశం ఉంటుంది. పాలకులు ఇలాంటి చర్యలేవీ చేపట్టకపోవడంతో ఇప్పటికే అనేకమంది అన్నదాతలు అసువులుబాశారు. అనాథలైన వారి కుటుంబాలు అంతులేని విషాదాలను ఎదుర్కొన్నాయి’ ఆవేదన వ్యక్తం చేశారు.